ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అకాల వర్షంతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలు, ఈదురు గాలులు, వడగండ్లతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రాథమిక అంచనా మేరకు 2 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బ తిన్నాయి అని క్షేత్ర స్థాయి సమాచారం ద్వారా తెలిసింది. ఇప్పటికే రైతులు ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా కౌలు రైతులు అప్పులతో సతమతమవుతున్నారు. ఈ సమయంలో వడగండ్లతో కూడిన వర్షాలు వారిని మరింత కుంగదీస్తున్నాయి. వీరికి తక్షణ ఆర్ధిక సాయంతోపాటు పంట నష్ట పరిహారాన్ని సత్వరమే అందించాలని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
“పల్నాడు ప్రాంతంలో మిర్చి రైతుల బాధలు నా దృష్టికి వచ్చాయి. కళ్ళాల మీద పంట నీట మునిగిపోవడంతో రైతులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఈ దఫా ధర పెరుగుతోందని ఆశపడ్డ రైతులకు ఆపదనే మిగిలింది. ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని మిర్చి రైతులు సైతం నష్టపోయారు. అదే విధంగా ఉమ్మడి కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని మామిడి, మొక్క జొన్న, పొగాకు రైతులు కూడా దెబ్బతిన్నారు. రాయలసీమ ప్రాంతంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉద్యాన పంటల మీద ఆధారపడ్డ రైతులకు ఈ అకాల వర్షాలు, గాలులు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. అరటి, మొక్కజొన్న, కర్బూజ, బొప్పాయి లాంటి పంటలు దెబ్బ తిన్నాయి. నెల్లూరు జిల్లాలో వరి రైతులు తమ పంట అమ్ముకొనే సమయంలో వర్షాలతో నష్టాల పాలయ్యారు. ఈ అకాల వర్షాలు, ఈదురు గాలులు వల్ల దెబ్బ తిన్న రైతాంగాన్ని ఆదుకొనే విషయంలో ప్రభుత్వం ఉదారంగా, మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. పంట నష్టాల గణాంకాలను పార్టీలు, వర్గాలతో సంబంధం లేకుండా నమోదు చేయాలని అధికారులను కోరుతున్నాను. మా పార్టీ నాయకులకు సైతం క్షేత్ర స్థాయిలో పంటలు నష్టపోయిన రైతులను పరామర్శించి ధైర్యం చెప్పాలని సూచించాను” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE