జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంగళవారం సాయంత్రం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా జనసేన పార్టీ కార్యనిర్వాహక సభ్యుల సమావేశం నిర్వహించారు. పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, పీఏసీ సభ్యులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర అధికార ప్రతినిధులు, అనుబంధ విభాగాల చైర్మన్లు, రాష్ట్ర కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు టెలీ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీలతో పొత్తులపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పలు పార్టీలు మనతో పొత్తులు కోరుకున్నప్పటికీ మనం మాత్రం ముందుగా సంస్థాగత నిర్మాణంపై పూర్తి స్థాయిలో దృష్టి సారిద్దామని పవన్ కళ్యాణ్ జనసేన నాయకులతో అన్నారు. ఇప్పటికే బీజేపీతో పొత్తులో ఉన్నామని, ఈ వ్యవహారంలో అంతా ఒకటే మాట మీద ఉందామన్నారు. ఎవరు ఏం మాట్లాడినా, మైండ్ గేములు ఆడినా ఎవరూ కూడా పావులు కావద్దని నిర్దేశించారు. సంస్థాగత నిర్మాణం మీద దృష్టి సారిద్దామని చెప్పారు. తన ఒక్కడి నిర్ణయం మీద ముందుకు వెళ్లనని, పూర్తి ప్రజాస్వామ్యబద్ధంగా అందరికీ ఆమోదయోగ్యమైన ఆలోచనే ముందుకు తీసుకువెళ్తానన్నారు. అప్పటి వరకు ఎవరేం మాట్లాడినా సంయమనంతోనే ఉండాలని పార్టీ నాయకత్వానికి పవన్ కళ్యాణ్ సూచించారు.
ఆవిర్భావ దినోత్సవ నిర్వహణకు కమిటీ:
“అలాగే గత సంవత్సరం కోవిడ్ పరిస్థితుల వల్ల పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోలేకపోయాం. ఆ సభను ఘనంగా జరుపుకోవాలన్నది నా ఆకాంక్ష. దాని కోసం అయిదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తాం. ఆవిర్భావ సభను ముందుకు ఎలా తీసుకువెళ్లాలో దిశానిర్దేశం చేస్తే ఆ విధంగా ముందుకు తీసుకువెళ్లాం. ఆ ఆవిర్భావ సభలో 2024 ఎన్నికలకు ఏ విధంగా సమాయత్తం కావాలి అనే అంశాలను ఒక ఆలోచనతో ముందుకు తీసుకువెళ్తాము” అని పవన్ కళ్యాణ్ అన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ