జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నవంబర్ 5, మంగళవారం నాడు విశాఖపట్నంలో జనసేన కార్యకర్తలు, జిల్లా నియోజకవర్గాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై పలు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాజధానిని పులివెందులకు మార్చుకుంటే నయమని అన్నారు. కర్నూల్ లో హైకోర్టు పెట్టుకుంటే పులివెందుల నుంచి వెళ్ళిరావడం సులువుగా ఉంటుందని వ్యాఖ్యానించారు. దీనితో సీఎం జగన్ కు ఖర్చులు కూడ తగ్గుతాయని పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేసారు. అదేవిధంగా హైకోర్టును చీపురుపల్లిలో పెట్టాలని మంత్రి బొత్స సత్యనారాయణను కూడ కోరదామంటూ మరో వ్యంగ్యాస్త్రం సంధించారు.
పదివ తరగతి విద్యార్థులకు అబ్దుల్ కలాం పేరిట ఇచ్చే ప్రతిభా పురస్కారాలకు పేరు మార్పుపై ప్రజల్లో వ్యతిరేకత చూసిన తరువాతనే ఆ జీవో గురించి తనకు తెలియదని సీఎం జగన్ అంటున్నారని పవన్ కళ్యాణ్ విమర్శించారు. పేరు మారుస్తూ జీవో జారీ చేసిన వారిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ రోజు విశాఖపట్నంలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో పోటీచేసిన జనసేన నాయకులతో పవన్ కళ్యాణ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయా జిల్లాల్లో పార్టీ పరిస్థితిఫై చర్చించి, భవిష్యత్ కార్యచరణపై వారికీ దిశానిర్దేశం చేశారు. అనంతరం గత అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేసిన గాజువాక నియోజకవర్గ జనసేన కార్యకర్తలు, స్థానిక నాయకులతో తో పవన్ కళ్యాణ్ సమావేశమై పార్టీ పరిస్థితులపై చర్చించారు.
[subscribe]