మహిళా ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో స్వర్ణం పతకం గెలుచుకున్న పూసర్ల వెంకట (పీవీ) సింధుకు మరోసారి చుక్కెదురైంది. నవంబర్ 5, మంగళవారం నాడు మొదలైన చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో ఆరో సీడ్గా బరిలోకి దిగిన పీవీ సింధు తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. ప్రపంచ 42వ ర్యాంక్ షట్లర్ పాయ్ యు పో (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయింది. 74 నిమిషాలపాటు జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్లో పీవీ సింధు 13–21, 21–18, 19–21తో ఓడిపోయింది. తోలి గేమ్ కోల్పోయాక పుంజుకుని రెండో గేమ్ గెలుచుకుంది. కానీ మూడో గేమ్ లో గేమ్ పాయింట్ వద్ద ఒత్తిడికి గురై మ్యాచ్ చేజార్చుకుంది. ఆగస్టులో జరిగిన ప్రపంచ చాంపియన్షిప్లో రెండో రౌండ్లో ఇదే పాయ్ యు పో పై సింధు అలవోకగా విజయం సాధించింది.
విశ్వవిజేతగా నిలిచిన సింధుకు తరువాత జరిగిన ఐదు టోర్నీలలో తన ప్రత్యర్థుల నుంచి గట్టిపోటీ ఎదురైంది, కొరియా, డెన్మార్క్ ఓపెన్ లలో తొలి రౌండ్లోనే వెనుదిరిగింది. ఐదు టోర్నీల్లో ఒక్కసారి కూడ క్వార్టర్ ఫైనల్ దశను దాటకపోవడం విశేషం. ఇక ఇదే టోర్నీలో పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రణయ్ 17–21, 18–21తో డెన్మార్క్ ఆటగాడు రస్ముస్ గెమ్కే చేతిలో ఓడిపోయాడు. మిక్స్డ్ డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్, అశ్విని పొన్నప్ప జోడీ 21-19, 21-19 తేడాతో కెనడా ద్వయం జోష్వా హర్ల్బర్ట్, జోసెఫిన్ వుపై గెలిచి శుభారంభం చేసారు.