జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఫిబ్రవరి 20, గురువారం నాడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఈ రోజు ఉదయం ఆయన కేంద్రీయ సైనిక బోర్డు కార్యాలయాన్ని సందర్శించారు. గత డిసెంబర్ 9న మిలటరీ డే సందర్భంగా అమరవీరుల కుటుంబాల సంక్షేమం కోసం విరాళంగా ప్రకటించిన కోటి రూపాయల చెక్కును, కేంద్రీయ సైనిక బోర్డు కార్యదర్శి బ్రిగేడియర్ మృగేందకుమార్కు పవన్ కళ్యాణ్ అందజేశారు. అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ సైనిక కుటుంబాల సంక్షేమం కోసం తనవంతుగా సహాయం అందించడం సంతోషంగా ఉందని చెప్పారు. జనసైనికులు, అభిమానులు కూడా సైనిక కుటుంబాలకు సహాయం చేయాలని కోరారు.
అలాగే మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరగనున్న ఇండియన్ స్టూడెంట్స్ పార్లమెంట్ సదస్సులో పవన్ పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని కేంద్ర మానవవనరుల శాఖ నిర్వహిస్తుంది. దేశానికి స్వచ్ఛమైన యువ రాజకీయ నాయకత్వాన్ని అందించడానికి ఉద్దేశించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ హాజరై ఉపన్యాసిస్తారు. అలాగే ఈ కార్యక్రమ సందర్భంగా పవన్ కళ్యాణ్ గురించి చిత్రీకరించిన ఒక షార్ట్ ఫిలింను కూడా ప్రదర్శించనున్నారు. ఈ సదస్సుకు మేఘాలయ అసెంబ్లీ స్పీకర్ మెత్బా లింగ్లో అధ్యక్షత వహిస్తారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా, తదితరులు ఈ సదస్సుకు హాజరై ప్రసంగించనున్నారు.
[subscribe]