ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫిబ్రవరి 20, గురువారం నాడు వెలిగొండ ప్రాజెక్ట్ ను సందర్శించారు. ప్రకాశం జిల్లాతోపాటుగా కడప, నెల్లూరు జిల్లాల్లో 4 లక్షల ఎకరాలకు పైగా సాగునీరు అందించడమే లక్ష్యంగా నిర్మిస్తున్న వెలిగొండ ప్రాజెక్ట్ పనులను సీఎం వైఎస్ జగన్ పరిశీలించారు. వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించి ప్రకాశం జిల్లాలోని పెద్దదోర్నాల మండల పరిధిలో కొత్తూరు వద్ద జరుగుతున్న పనులను సీఎం పర్యవేక్షించారు. ప్రాజెక్ట్ యొక్క మొదటి టన్నెల్, రెండో టన్నెల్ లోపలికి వెళ్లి పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా ప్రాజెక్ట్ నిర్మాణ పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రాజెక్టు వద్దే జలవనరుల శాఖ ఉన్నతాధికారులు, జిల్లా అధికారులతో ప్రాజెక్టు పనులపై సమీక్ష నిర్వహించారు. శ్రీశైలం జలాశయం నుంచి కృష్ణ వరద నీటిని మళ్లించి సాగు నీటితో పాటుగా తాగునీరు కూడా అందించే విధంగా ఈ ప్రాజెక్ట్ను రూపొందిస్తున్నారు. ప్రాజెక్ట్ నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి, నీటి విడుదలకు ఏర్పాట్లు చేసే నేపథ్యంలోనే సీఎం వైఎస్ జగన్ వెలిగొండ ప్రాజెక్ట్ పరిశీలనకు వెళ్లినట్టుగా తెలుస్తుంది.
[subscribe]