ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి(50) కన్నుమూశారు. సోమవారం ఉదయం గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడించారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో వస్తున్న అసత్యాలపై స్పందిస్తూ, గౌతమ్ రెడ్డి మృతికి ముందు చోటుచేసుకున్న పరిణామాలపై మంత్రి మేకపాటి కుటుంబం ఒక ప్రకటన విడుదల చేసింది. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వ్యాయామం చేస్తూ ఇబ్బందిపడ్డారన్న వార్తలు అవాస్తవమని మంత్రి కుటుంబం పేర్కొంది. ఆదివారం రాత్రి జరిగిన ఓ ఫంక్షన్ లో యథావిధిగా సంతోషంగా గడిపి రాత్రి 9.45 కల్లా మంత్రి మేకపాటి ఇంటికి చేరుకున్నారని తెలిపారు.
“ఉదయం 6.00 గంటలకి రోజూలాగే ఉదయాన్నే మంత్రి మేల్కొన్నారు. 6:30 గంటల వరకూ ఫోన్ చూసుకుంటూ ఉన్నారు. 7.00 గంటలకు నివాసంలోని రెండో అంతస్తులోని సోఫాలో మంత్రి కూర్చున్నారు. 7:12కి అత్యంత సన్నిహితంగా ఉండే మంత్రి డ్రైవర్ నాగేశ్వరరావును పిలవమని వంట మనిషికి చెప్పారు. 7:15 గంటలకు హఠాత్తుగా గుండెపోటుతో సోఫా నుంచి మెల్లిగా మంత్రి కిందకి ఒరిగారు. 7:16 గంటలకు కంగారు పడి మంత్రి మేకపాటి సతీమణి శ్రీకీర్తి గట్టిగా అరిచారు. 7:18కి పరుగుపరుగున వచ్చి గుండె నొప్పితో ఇబ్బందిపడుతున్న మంత్రి ఛాతిమీద మంత్రి డ్రైవర్ నాగేశ్వరరావు చేయితో నొక్కి స్వల్ప ఉపశమనం కలిగించారు. 7:20 గంటలకు మంత్రి మేకపాటి పక్కనే ఉన్న భార్య శ్రీకీర్తి అప్రమత్తం అయ్యారు. 7:20కి మంచినీరు కావాలని మంత్రి మేకపాటి అడగగా, ఇచ్చినా తాగలేని పరిస్థితుల్లో ఉండడంతో మంత్రి వ్యక్తిగత సిబ్బందిని శ్రీకీర్తి పిలిచారు. 7:22 కి నొప్పి పెడుతుంది కీర్తి అంటున్న మంత్రి మాటలకు స్పందించి, వెంటనే ఆస్పత్రికి వెళదామని మంత్రి సిబ్బంది బయలుదేరారు. 07:27 కు మంత్రి ఇంటి నుంచి అపోలో ఆస్పత్రికి గల 3 కి.మీ దూరాన్ని, అత్యంత వేగంగా కేవలం 5 నిమిషాల్లో అపోలో ఆస్పత్రిలోని అత్యవసర చికిత్స విభాగానికి మంత్రి మేకపాటిని డ్రైవర్, సిబ్బంది చేర్చారు. 8:15 గంటలకు పల్స్ బాగానే ఉంది, ప్రయత్నిస్తున్నామని అపోలో వైద్యులు తెలిపారు. 9:13 గంటలకు మంత్రి మేకపాటి ఇక లేరని అపోలో ఆస్పత్రి వైద్యులు నిర్ధారించారు. 9:15 గంటలకు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చనిపోయినట్లు అపోలో ఆసుపత్రి యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది” అని మేకపాటి కుటుంబం ఒక ప్రకటనలో పేర్కొంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ