ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో ఇప్పటికే 73 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో శ్రీకాళహస్తి పట్టణంలోనే అత్యధిక కేసులు నమోదు కావడంతో పట్టణం మొత్తాన్ని రెడ్ జోన్ పరిధిలోకి తెచ్చారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో శ్రీకాళహస్తిలో కఠిన ఆంక్షలు అమలు చేస్తూ, కట్టుదిట్టమైన చర్యలకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో ఈ రోజు నుంచి (ఏప్రిల్ 24, శుక్రవారం) శ్రీకాళహస్తిలో ఎలాంటి లాక్డౌన్ సడలింపులు ఉండవని, ప్రజలు ఎట్టిపరిస్థితుల్లోనూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని చిత్తూరు జిల్లా కలెక్టర్ నారాయణ భరత్గుప్తా స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే కేసులు తప్పవని చెప్పారు.
నిత్యావసర వస్తువులు, మందులు అవసరమైన వారికి వాలంటీర్ల ద్వారా డోర్ డెలివరీ చేస్తామని చెప్పారు. శ్రీకాళహస్తి నుంచి ఉద్యోగాల రాకపోకలను కూడా నిషేదిస్తునట్టు తెలిపారు. కరోనా నియంత్రణలో భాగంగా ప్రజలకు కొన్ని రోజుల పాటు ఇబ్బందులు తప్పవని, అందరూ అధికారులకు సహకరించాలని జిల్లా కలెక్టర్ కోరారు. మరోవైపు శ్రీకాళహస్తి పట్టణాన్ని రెడ్ జోన్ పరిధిలోకి తెచ్చిన నేపథ్యంలో గురువారం రాత్రి అధికారులు పెట్రోలింగ్ వాహనాలతో మాక్ డ్రిల్ నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu