ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం నాడు సచివాలయంలో స్పందన కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు పథకాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ పథకం అమలుపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కొత్తగా 2059 రోగాలకు ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. జనవరి 3 నుంచి కొత్త ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ ప్రారంభం అవుతుందన్నారు. ముందుగా జనవరి 3న 1.5 లక్షల ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణి చేయబోతున్నామన్నారు.
అలాగే ఫిబ్రవరి చివరి నాటికి 1.42 కోట్ల ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చేయనున్నట్టు సీఎం వివరించారు. విస్తరించిన ఆరోగ్యశ్రీ సేవలు పశ్చిమగోదావరి జిల్లాలో జనవరి 3న పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించనున్నారు. మిగతా జిల్లాల్లో 1259 రోగాలకు ఆరోగ్యశ్రీ సేవలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఒక్కో జిల్లా పెంచుకుంటూ 2059 రోగాలకు ఆరోగ్యశ్రీని వర్తింపజేయనున్నారు. ఈ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని జనవరి 3న ఏలూరులో చేపట్టనున్నారు. సీఎం ఏలూరు పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు జిల్లా అధికారులను ఆదేశించారు.
[subscribe]