ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో ఈ దశాబ్దపు వన్డే, టీ20, టెస్టు జట్లను ప్రకటించింది. వన్డే, టీ20 జట్లకు భారత్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని కెప్టెన్గా ఎంపిక చేయగా, టెస్ట్ సారధిగా మాత్రం ప్రస్తుత భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ వైపు మొగ్గు చూపింది. క్రిక్ఇన్ఫో మూడు ఫార్మాట్స్ కు ప్రకటించిన దశాబ్దపు జట్లలో భారత్ నుంచి ధోని, కోహ్లీతో పాటు, రోహిత్ శర్మ, జశ్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్లు చోటు దక్కించుకున్నారు. 23 మంది సభ్యులతో కూడిన ప్యానెల్ ఈ జట్లను ఎంపిక చేసింది. ఈ దశాబ్దంలో ఆరేళ్లకు పైగా ఆడడం లేదా కనీసం 50 టెస్టులైనా ఆడిన ఆటగాళ్ల ప్రదర్శనను మాత్రమే పరిగణలోకి తీసుకుని టెస్టు జట్టును ప్రకటించారు. అలాగే పరిమిత ఓవర్ల క్రికెట్ లో కనీసం 75 వన్డేలు, 100 టీ20 ప్రాతిపదికగా తీసుకుని ఆటగాళ్లను ఎంపిక చేసినట్లు క్రిక్ఇన్ఫో వివరించింది.
క్రిక్ఇన్ఫో టెస్టు జట్టులో విరాట్ కోహ్లితో పాటుగా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మాత్రమే చోటు దక్కించుకున్నాడు. ఇక వీరితో పాటు ఇంగ్లాండ్ జట్టు మాజీ ఓపెనర్ అలిస్టర్ కుక్, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్లు టెస్టు జట్టులో ఉన్నారు. వన్డే జట్టులో ధోని, కోహ్లిలతో పాటు రోహిత్ శర్మకు అవకాశం దక్కింది. అలాగే టీ20 జట్టులో ధోనీ, కోహ్లీ, బుమ్రా స్థానం సంపాదించారు. క్రిక్ఇన్ఫో టీ20 దశాబ్దపు జాబితాలో వెస్టిండీస్ ఆటగాళ్ల ఆధిపత్యం కొనసాగింది. క్రిస్ గేల్, డ్వేన్ బ్రేవో, సునీల్ నరైన్, పొలార్డ్, ఆండ్రు రసెల్లు టీ20 జట్టులో చోటు దక్కించుకున్నారు. ఒక్క విరాట్ కోహ్లీ మాత్రమే మూడు ఫార్మాట్లలో స్థానం దక్కించుకున్నాడు. మరోవైపు మహిళల వన్డే, టీ20 జట్లలో మిథాలీ రాజ్, పేసర్ జులన్ గోస్వామిని చోటు దక్కించుకోగా, ఈ రెండు ఫార్మాట్స్ కు ఆసీస్ క్రికెటర్ మెగ్ లాన్నింగ్ను కెప్టెన్గా ప్రకటించారు.