తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రక్షణపై కేంద్ర ప్రభుత్వ భద్రతా సంస్థ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్జీ) సమీక్ష చేపట్టింది. ఈ మేరకు ఎన్ఎస్జీ డీఐజీ సమర్దీప్ సింగ్ గురువారం ఏపీకి వచ్చారు. కాగా జడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న చంద్రబాబుకు ఎన్ఎస్జీ బృందం రక్షణ కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా డీఐజీ సమర్దీప్ సింగ్ ఉండవల్లి లోని చంద్రబాబు నివాసాన్ని మరియు టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఇక చంద్రబాబు రోజువారీ కార్యక్రమాల తీరు, పర్యటనల సందర్భంగా ఎదురవుతున్న పరిస్థితులను టీడీపీ కార్యాలయ కార్యదర్శి, ఎమ్మెల్సీ అశోక్ బాబు డీఐజీ సమర్దీప్కు వివరించారు. అనంతరం భద్రతా సిబ్బందితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో చంద్రబాబు పర్యటనల నేపథ్యంలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై డీఐజీ సమర్దీప్ వారితో చర్చించారు.
అలాగే చంద్రబాబు నాయుడును కలవడానికి వచ్చేవారిని తనిఖీ చేసే విధానంతో పాటు ఎలాంటి సాంకేతిక పరికరాలు వాడుతున్నారు అనే విషయాలపై ఎన్ఎస్జీ డీఐజీ వారిని అడిగి తెలుసుకున్నారు. మరో రెండేళ్లలో ఎన్నికలు దృష్ట్యా ఆయన భద్రత విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి కీలక సూచనలిచ్చారు. ఈ క్రమంలో చంద్రబాబుకు భద్రత పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో చంద్రబాబుకు గతంలో 8 మంది నేషనల్ సెక్యూరిటీ గార్డులు రక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తుండగా, ఇకపై అదనంగా మరో 20 మందిని కేటాయించారు. అలాగే గతంలో డీఎస్పీ ర్యాంకు అధికారి పర్యవేక్షణలో భద్రతా సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా, ఇక నుంచి డీఐజీ ర్యాంకు అధికారి పర్యవేక్షణ వహించనున్నారు. కాగా తాజాగా చంద్రబాబు కుప్పం పర్యటనలో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ను వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేయడం, ఆయన పర్యటించిన గ్రామాల్లో టీడీపీ ఫ్లెక్సీలను చించివేయడం వంటి ఘర్షణపూరిత వాతావరణంలో ఎన్ఎస్జీ ఆయన భద్రతా పెంపు నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY