ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక కొరత సమస్యపై టీడీపీ, జనసేన పార్టీలు తమ గళాన్ని గట్టిగా వినిపిస్తున్నాయి. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, భవన నిర్మాణ కార్మికుల కోసం నవంబరు 3న విశాఖలో లాంగ్ మార్చ్ చేపట్టాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లాకు చెందిన తాపీమేస్త్రి నాగ బ్రహ్మాజీ ఆత్మహత్య ఉదంతంపై పవన్ కళ్యాణ్ స్పందించారు. నాగ బ్రహ్మాజీ ఆత్మహత్య, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల ఎదురుకుంటున్న భయంకరమైన పరిస్థితిని ప్రతిబింబిస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన అస్తవ్యస్తమైన ఇసుక విధానం కారణంగా 19.6 లక్షల మంది కార్మికులను ప్రత్యక్షంగా, మరో పది లక్షల మంది కార్మికులను పరోక్షంగా ఉపాధి కోల్పోయారని, వారి కుటుంబాలు దుర్భర పరిస్థితులలోకి నెట్టివేయబడ్డాయని అన్నారు.
తన వంతు సాయంగా ఆత్మహత్య చేసుకుని మరణించిన తాపీమేస్త్రి నాగ బ్రహ్మజీ కుటుంబానికి లక్ష రూపాయలు ఇస్తున్నట్టు ప్రకటించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు. ఇసుక కొరతతో ఇబ్బందులు పడుతున్న 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులను వెంటనే ఆదుకోవడానికి చర్యలు చేపట్టాలని పవన్ కళ్యాణ్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. టీడీపీ పార్టీ ఇప్పటికే పలు ప్రాంతాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపడుతుంది. మరో వైపు ఇసుక కొరత కష్టాలు అతి త్వరలోనే తొలగిపోతాయని, ప్రజలు, భవన నిర్మాణ కార్మికులు ఆందోళన చెందవద్దని రాష్ట్ర మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేస్తున్నారు. నదుల్లో, వాగుల్లో భారీగా వరద నీరు ప్రవహిస్తుండడంతో ఇసుక తవ్వకాలు పూర్తి స్థాయిలో సాధ్యం పడడం లేదని చెబుతున్నారు.
[subscribe]