ఇస్లామిక్ స్టేట్ వ్యవస్థాపకుడు అబు బకర్ అల్ బాగ్దాదీ అక్టోబర్ 27, ఆదివారం నాడు హతమయ్యాడు. అమెరికా సైన్యం రహస్యంగా జరిపిన దాడిలో వారినుంచి తప్పించుకుంటూ ఆత్మాహుతికి పాల్పడ్డాడు. అబు బకర్ బాగ్దాదీ మరణాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధృవీకరించాడు. ఆదివారం నాడు వైట్ హౌస్ లో మాట్లాడుతూ, అమెరికా సైన్యం దాడులు చేసిన సమయంలో ఐసిస్ చీఫ్ బాగ్దాదీ ఆత్మాహుతికి పాల్పడ్డాడని, ఆ సమయంలో తన ముగ్గురు పిల్లలను కూడ అతను చంపి వేసినట్టు ట్రంప్ తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత హింసాత్మక ఉగ్రవాద సంస్థగా ఉన్న ఐసిస్ అధినేత బాగ్దాదీ కోసం అమెరికా ఎన్నో సంవత్సరాలుగా వెతుకుతోందని, చివరకు అమెరికా ప్రత్యేక దళాలు చేసిన దాడులు అతన్ని హతమార్చినట్టు పేర్కొన్నారు.
ఈ దాడుల్లో అమెరికా దళాలు బాగ్దాదీని పట్టుకోవడానికి ప్రయత్నించగా అతడు ప్రాణ భయంతో పిరికివాడిలా ఏడుస్తూ తనంతట తానుగా పేల్చుకుని, చివరకు కుక్క చావు చవి చూశాడని డోనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఈ ఆపరేషన్లో పలువురు బాగ్దాదీ అనుచరులు కూడా మరణించినట్లు తెలిపారు. అమెరికా దళాలలో ఎవరూ గాయపడలేదని చెప్పారు. బాగ్దాదీని అంతం చేయాలనే తమ లక్ష్యం పూర్తి అయినందువలన అమెరికా సైన్యం, ఈశాన్య సిరియా ప్రాంతం నుంచి త్వరలో వైదొలుగుతుందని ట్రంప్ ప్రకటించారు.
[subscribe]