భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన నగరమైన విశాఖపట్నంలో త్వరలో తన ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ఆర్బీఐ వర్గాలు వెల్లడించాయి. కాగా విశాఖలో ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్రంలోని అన్ని ఏపీ సంబంధిత లావాదేవీలను సులువుగా నిర్వహించడానికి వీలవుతుందని భావిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్లోని తెలంగాణ ప్రభుత్వంతో ఏపీ ప్రభుత్వం ఆర్బీఐ కార్యాలయాన్ని పంచుకుంటుందని వారు గుర్తు చేశారు. ఇక్కడ ప్రాంతీయ కార్యాలయం లేకపోవడం వల్ల ఏపీ ప్రభుత్వ అధికారులు ఏదైనా ఆర్బీఐ సమావేశాలకు హాజరు కావడానికి హైదరాబాద్కు వెళ్లాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ అధికారులు ఇటీవల విశాఖ కలెక్టర్ మల్లికార్జున్ను కలిసి తమ ప్రతిపాదనను వివరించారు.
ఈ క్రమంలో దాదాపు 500 మంది సిబ్బందితో ఇక్కడే కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి సిద్దమయింది. దీనికోసం నగర పరిధిలో 30,000 చదరపు అడుగుల స్థలం కావాలని అపెక్స్ బ్యాంక్ అధికారులు ఒక ప్రణాళికను సమర్పించారు. ఇక కార్యాలయం ఏర్పాటుకు నిర్మాణం పూర్తయిన భవనాలకే ఆర్బీఐ అధికారులు మొగ్గు చూపుతున్నారు. దీంతో నగరంలోని రిషికొండ, మధురవాడ, భీమిలి, కైలాసగిరి, కొమ్మాది, ఆరిలోవ తదితర ప్రాంతాల్లోని నూతన భవనాలను పరిశీలించారు. కాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి త్వరలో విశాఖపట్నంను రాష్ట్ర రాజధానిగా తీర్చిదిద్దుతామని ఇటీవలే ఢిల్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే. సీఎం జగన్ ప్రకటన వెలువడిన కొద్ది రోజులకే ఆర్బీఐ తాజా నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE