టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలు అంశాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా ప్రభుత్వంపై ఆయన పలు విమర్శలు గుప్పించారు. పింఛను అర్హత వయసు ఐదేళ్లు తగ్గిస్తే లబ్ధిదారుల సంఖ్య పెరగాల్సింది పోయి తగ్గడం వింతగా ఉందని చంద్రబాబు అన్నారు. ” పింఛను అర్హత వయసు 5ఏళ్లు తగ్గిస్తే, ఉన్న పింఛన్లు ఇంకా పెరగాల్సింది పోయి తగ్గడం వింతగా ఉంది. ఏమిటీ జగన్మాయ. 8నెలల్లో 7లక్షల పించన్లకు కోత పెట్టడం, పండుటాకులను మోసం చేయడం కాదా? 45ఏళ్లకే బిసి,ఎస్సీ,ఎస్టీ, మైనారిటి మహిళలకు పింఛను ఇస్తామని హామీ ఇచ్చి ఏమార్చడం మోసం కాదా?, కేంద్రం ఇచ్చిన రూ 6వేలకు అదనంగా రూ. 12,500 ఇస్తామని చెప్పి, రైతులను మోసం చేశారు. నిరుద్యోగ భృతి రద్దు చేసి యువతకు టోపి పెట్టారు. ఇంత మోసకారి కాబట్టే 12 చార్జిషీట్లలో ఇప్పటికీ 420 సెక్షన్ కింద విచారణ ఎదుర్కొంటున్నారు. అయినా మోసాలు చేయడం మాత్రం మానుకోవట్లేదని” చంద్రబాబు ఘాటుగా స్పందించారు.
అలాగే రాజధాని అమరావతి రైతుల ఉద్యమం, ఆంధ్రప్రదేశ్కు కొత్త పెట్టుబడులు అంశంపై కూడా చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. ” అమెరికాలోని న్యూజెర్సీ ప్రవాసాంధ్రుల ప్రతినిధులు నన్ను కలిసి, అమరావతి పరిరక్షణ జెఏసి తరఫున సేకరించిన ఎన్నారైల విరాళం రూ. 7,76,022ల చెక్కును అందజేశారు. రాజధానికి భూములిచ్చిన రైతులు, మహిళలు, రైతుకూలీలు, కార్మికులకు సంఘీభావంగా ప్రవాసాంధ్రులు కూడా ముందుకు రావడం ముదావహం. అంతేకాదు లండన్, కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా, దుబాయ్ తదితర గల్ఫ్ దేశాల్లో కూడా ఎన్నారైలు రాజధాని రైతుకు సంఘీభావ ర్యాలీలు జరపడం అభినందనీయం. ఎందుకంటే ఇది ఏ కొందరి సమస్యో, ఒక ప్రాంతం సమస్యో కాదు. వైసిపి ఆడుతున్న ఈ మూడు ముక్కలాట మొత్తం రాష్ట్రాన్నే అతలాకుతలం చేస్తుంది. ఇప్పటికే వచ్చిన పెట్టుబడులు వెనక్కి పోయాయి. కంపెనీలన్నీ వేరే రాష్ట్రాలకు పోయాయి. కొత్త పెట్టుబడులు ఆగిపోయి, ఉపాధి కల్పనకు అడ్డుగోడ కట్టినట్టయ్యింది. తెదేపా అభివృద్ది అంతటినీ రివర్స్ చేశారు. ఈ పరిస్థితుల్లో రాజధాని అమరావతి పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత” అని చంద్రబాబు పేర్కొన్నారు.
[subscribe]