తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జనవరి 31, శుక్రవారం నాడు మాదాపూర్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో క్రెడాయ్ ప్రాపర్టీ షో-2020 ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, నాలుగేళ్ళ క్రితమే స్థిరాస్తి వ్యాపారుల సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ పరిష్కరించారని, ఇకపై స్థిరాస్తి వ్యాపారులు నూతన సాంకేతికతను వినియోగించాలని కోరారు. నిర్మాణ సంస్థలు కేవలం హైదరాబాద్ మీదే కాకుండా ద్వితీయ శ్రేణి నగరాలపై కూడా దృష్టి సారించాలని సూచించారు. తెలంగాణలో అమలు చేసిన టీఎస్ ఐపాస్ దేశానికి ఆదర్శంగా నిలిచిందని, ఇదే తరహాలో భవన నిర్మాణ అనుమతుల కోసం త్వరలోనే టీఎస్ బీపాస్ విధానాన్ని తీసుకువస్తున్నామని కేటీఆర్ చెప్పారు. ఇకపై ఎటువంటి అవినీతికి తావులేకుండా భవన నిర్మాణాలకు అనుమతులు ఇస్తామని తెలిపారు.
రాష్ట్రంలో అన్ని రకాల ఎన్నికలు ముగిశాయి కాబట్టి పాలనపైనే పూర్తిస్థాయి దృష్టి సారిస్తామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఒక్క హైదరాబాద్ మీదనే కాకుండా రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల అభివృద్ధిపై కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అన్నారు. మున్సిపాలిటీల ద్వారా పట్టణాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నామని, రాష్ట్రవ్యాప్తంగా మౌలిక వసతులు కల్పించి అభివృద్ధి అవకాశాలు మెరుగుపరుస్తామని చెప్పారు. అలాగే హైదరాబాద్ నగరానికి చెందిన అంశాలు ప్రస్తావిస్తూ మరో వారం పది రోజుల్లో జేబీఎస్ మెట్రో కారిడార్ను ప్రారంభిస్తామని అన్నారు. మెట్రో రెండోదశతో పాటుగా ఎస్ఆర్డీపీ పనుల విస్తరణకు ప్రణాళికలు రూపొందిస్తామని తెలిపారు. హైదరాబాద్ చుట్టూ స్థిరాస్తి వ్యాపారం విస్తరించేలా ముందుకెళ్లాలని సూచించారు. ఈ ఏడాదిలోనే టీ-హబ్ రెండో దశతో పాటుగా హైదరాబాద్ ఔషధ నగరిని కూడా ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
[subscribe]