కోవిడ్ విధుల్లో నిమగ్నమై చనిపోతున్న వారి కుటుంబాలను ఆదుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని కోరారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ త్యాగాలను విస్మరించకుండా, ఒక్కో కుటుంబానికి రూ.కోటి పరిహారం మరియు ఉద్యోగం ఇవ్వాలని అన్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ” కరోనా మహమ్మారి పేరు వింటేనే ప్రతి ఒక్కరూ వణికిపోతుంటే, ఆ వైరస్ బారిన పడినవారికి వైద్య సేవలు అందిస్తూ, ఈ క్లిష్ట తరుణంలో ముందుండి ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తున్న వైద్యులు, నర్సింగ్ స్టాఫ్, ల్యాబ్ ఉద్యోగులు, ఆసుపత్రి సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, ఇలా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉన్న ప్రతి ఒక్కరి సేవలు విస్మరించలేనివి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 200 వరకూ వైద్యులు, వైద్య విద్యార్ధులు, నర్సింగ్ స్టాఫ్, 600 మంది పోలీసులు కరోనా బారినపడ్డారని తెలుస్తోంది. పోలీస్ శాఖలో 10 మంది వరకూ కరోనాకు బలయ్యారు. ప్రాణాలకు తెగించి రోగులకు సేవలందిస్తూ వైద్య ఆరోగ్య సిబ్బంది, ప్రజా సంరక్షణలో పోలీస్, ఇతర విభాగాలు పని చేస్తున్నాయి. వారి త్యాగాన్ని ప్రభుత్వం గుర్తించాలని” పవన్ కళ్యాణ్ కోరారు.
“కరోనాపై పోరులో ఆ వైరస్ కి బలైన ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యతను విస్మరించకూడదు. పరిహారంగా రూ.కోటి ఇవ్వాలి. కుటుంబంలో ఒకరికి తక్షణమే ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు పలువురు విధులకు హాజరవుతూ ఉన్నారు. ఆ సమయంలో వారు కరోనా బారినపడుతున్నారు. వైద్యానికి, తదనంతరం తీసుకోవాల్సిన విశ్రాంతికీ నాలుగు వారాల సమయం అవసరం అవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈ కాలానికి వేతనంతో కూడిన ప్రత్యేక సెలవులు మంజూరు చేయాలి. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు ప్రైవేట్ సంస్థల్లో పని చేస్తున్నవారికీ ఈ తరహా సెలవులు అవసరం. ప్రైవేట్ సంస్థల నిర్వాహకులు కూడా ఈ విషయంలో సానుభూతితో ఆలోచించాలి. యాజమాన్యాలకు ఇబ్బందులు ఉన్నా సంస్థ కోసం పని చేసినవారు అనుకోకుండా కరోనా బారినపడ్డందున సెలవుల విషయంలో సానుకూలంగా వ్యవహరించాలి. వేతనం కోల్పోతామనే ఆందోళన లేకుండా వారు మానసిక ప్రశాంతతతో త్వరగా కోలుకొంటారని” పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu