ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు రాష్ట్రంలోని అర్హులందరికీ అందడం లేదని తెలిపారు టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు. గురువారం ఆయన విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలో టీడీపీ నిర్వహించిన ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమానికి హాజరయ్యారు. దీనిలో భాగంగా విశాఖ జిల్లా నుంచి కొత్తవలస మండలం చింతలపాలెం వద్ద విజయనగరంలోకి అడుగు పెట్టిన చంద్రబాబుకు టీడీపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు సహా పలువురు జిల్లా కీలక నేతలు పాల్గొన్నారు. అనంతరం రోడ్ షోలో పాల్గొన్న ఆయన రాత్రి 9 గంటలకు ఎస్ కోటలోని దేవి బొమ్మ కూడలి వద్ద భారీగా హాజరైన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ఏపీని సీఎం జగన్ సర్వనాశనం చేశారని, అభివృద్ధిలో ముందుకెళ్లాల్సిన రాష్ట్రం.. అవినీతిలో ముందుకెళ్తోందని మండిపడ్డారు. ప్రస్తుతం ఏపీ రూ.10 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని, దీనికి కారణం వైసీపీ ప్రభుత్వ విధానాలేనని విమర్శించారు. విద్యుత్ బిల్లులు, ఆర్టీసీ చార్జీలు, నిత్యావసరాల ధరలు, ఇంటి పన్నులను భారీగా పెంచారని, అయితే ఈ ఆదాయం అంతా ఏమవుతోందని ప్రశ్నించారు. ఈ నాలుగేళ్లలో చెప్పుకోదగ్గ ఒక్క కంపెనీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టలేదని, ఉన్నవాటిని కూడా కమీషన్ల కోసం వేధించి పక్క రాష్ట్రాలకు పారిపోయేలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేమంటే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారని, గతంలో ఉన్నవాటికే పేర్లు మార్చి తామే ప్రవేశపెట్టినట్లుగా ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అవి కూడా అందరికీ అందడం లేదని, సీఎం జగన్ ఆర్భాటంగా బటన్ నొక్కుడే తప్ప లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు పడడం లేదని అన్నారు. ప్రజల్లో వైసీపీ ప్రభుత్వంపై భ్రమలు తొలగిపోయాయని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జగన్ సర్కారును ఇంటికి పంపడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఇక ఏపీలో ఈసారి రాబోయేది టీడీపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేసిన చంద్రబాబు.. రాష్ట్రాభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE