తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన గురువారం నూతన సచివాలయంలో తొలి కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకొన్నారు. రాష్ట్రంలో కుల వృత్తులనే నమ్ముకొని జీవిస్తున్న బీసీ కులాల కుటుంబాలకు ఆర్ధికంగా తోడ్పాటు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. కుల వృత్తుల ఆధారిత కుటుంబాలకు రూ.1 లక్ష వరకు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో విశ్వబ్రాహ్మణ, నాయీ బ్రాహ్మణ, రజక, కుమ్మరి, మేదరి తదితర కులాలకు లబ్ది చేకూరనుంది. సీఎం కేసీఆర్ సూచనల మేరకు దీనికి సంబంధించిన విధివిధానాల రూపకల్పనకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ నేతృత్వంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీశ్ రెడ్డిలతో కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. అంతేకాకుండా రెండున్నర దశాబ్దాలకు పైగా 84 గ్రామాల్లోని వేలాది ఎకరాల భూముల్లో అభివృద్ధికి అడ్డుగా నిలిచిన 111 జీవోను తెలంగాణ రద్దు చేసింది. ఇక కేబినెట్ భేటీ వివరాలను మంత్రులు హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు మీడియాకు వెల్లడించారు.
తెలంగాణ మంత్రివర్గ భేటీలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలు..
- జీవో 111ను పూర్తిగా ఎత్తివేయాలని నిర్ణయం.
- హైదరాబాద్ చుట్టపక్కల 84 గ్రామాల ప్రజల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం.
- ఈ ప్రాంతం మీదుగా వెళ్లే శంకర్పల్లి-చేవెళ్ల రహదారిని 150 నుంచి 200 అడుగుల మేర విస్తరించాలని నిర్ణయం.
- తద్వారా 84 గ్రామాల పరిధిలోని మొత్తం 1,32,600 ఎకరాలలోని భూముల్లో నివాస, వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు అవకాశం.
- కుల వృత్తుల పైనే ఆధారపడి జీవిస్తున్న బీసీ కులాల కుటుంబాలకు రూ.1 లక్ష ఆర్ధిక సాయం.
- దీని విధి విధానాల రూపకల్పనకు మంత్రి గంగుల కమలాకర్ నేతృత్వంలో సబ్ కమిటీ ఏర్పాటు.
- రాష్ట్రావతరణ దశాబ్ది వేడుకలను 21 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని నిర్ణయం.
- ఒక్కో రోజు ఒక్కో రంగానికి సంబంధించిన విజయాలను ప్రజలకు వివరించేలా ప్రణాళికలు.
- రాష్ట్రంలోని 23,046 మంది వీఆర్ఏల రెగ్యులరైజ్కు ఆమోదం.
- వారి విద్యార్హతలు బట్టి ఇతర ప్రభుత్వ శాఖల్లో ప్లేస్మెంట్ చేయాలని నిర్ణయం.
- రైతుల సమస్యలపై పరిష్కారానికి మంత్రి నిరంజన్ రెడ్డి నేతృత్వంలో ఉపసంఘం ఏర్పాటు.
- పంటకాలాన్ని ఒక నెల ముందుకు జరుపడంపై అధ్యయనం.
- నకిలీ విత్తనాలను విక్రయిస్తే పీడీ కేసులు పెట్టాలని నిర్ణయం.
- మక్క, జొన్న తదితర సాంప్రదాయ పంటల కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ.
- మరో 15 రోజుల్లో రెండో విడత గొర్రెల పంపిణీకి నిర్ణయం.
- తెలంగాణ మైనారిటీ కమిషన్లో జైన మతస్థులకు చెందిన ప్రతినిధికీ చోటు కల్పించడానికి ఆమోదం.
- దీంతో ప్రస్తుతం కమిషన్లో 8 మంది సభ్యులు ఉండగా.. ఇకపై 9 మంది ఉండనున్నారు.
- విలేఖరుల కోసం వనపర్తిలో జర్నలిస్ట్ భవన్ నిర్మాణం, ఖమ్మంలో ఇళ్ల స్థలాలు కేటాయింపు.
- నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని ఉమామహేశ్వర ప్రాజెక్టు లిఫ్ట్ ఫేజ్-1, ఫేజ్-2కు గ్రీన్ సిగ్నల్.
- రాష్ట్రవ్యాప్తంగా వైద్యసేవల బలోపేతం కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని నిర్ణయం.
- దీనిలో భాగంగా.. హెల్త్ సెంటర్లలో రెగ్యులర్ పోస్టులు, కొత్తగా ఏర్పడిన 40 మండలాల్లో పీహెచ్సీల ఏర్పాటు.
- హైదరాబాద్లో 6గురు, మిగిలిన 32 జిల్లాల్లో 32 మందితో ప్రతి జిల్లాకు ఒక డీఎంహెచ్వో పోస్టులు మంజూరు.
- తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)ను మరింత బలోపేతం చేయాలని నిర్ణయం.
- ఈ కమిషన్ ఆధ్వర్యంలో పరీక్షలను మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు అసిస్టెంట్ ఎగ్జామినేషన్ కంట్రోలర్, సెక్యూరిటీ సూపర్వైజర్ వంటి 10 కొత్త పోస్టుల మంజూరుకు ఆమోదం.
- హిమాయత్ సాగర్, గండిపేట జలాశయాల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు.
- దీనికోసం రింగ్ మెయిన్ పైప్లైన్తో పాటు కలుషితాలు చేరకుండా ఎస్టీపీల నిర్మాణం.
- హిమాయత్ సాగర్, గండిపేట జలాశయాలతో పాటు మూసీ నదిని కూడా సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మ సాగర్తో అనుసంధానించాలని నిర్ణయం.
- అక్కడి నుంచి కాళేశ్వరం జలాలను ఈ జలాశయాలకు తరలించడానికి ఏర్పాట్లు.
- హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్కు కూడా గోదావరి నీటిని తరలించాలని నిర్ణయం.
- తద్వారా మురుగు నీటిని బయటికి పంపి, శుభ్రమైన జలాలతో హుస్సేన్ సాగర్ను నింపేందుకు అవకాశం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE