టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు మంగళవారం నుంచి మూడు రోజుల పాటు ఉమ్మడి గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. నేటినుంచి జిల్లాలో మూడు రోజుల పాటు ఆయన ‘ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇక తొలిరోజు పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు పెదకూరపాడు నియోజకవర్గంలో కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ క్రమంలో ముందుగా నేటి సాయంత్రం అమరావతిలో రోడ్ షో నిర్వహించి బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. కాగా, టీడీపీ అధినేత పర్యటన సందర్భంగా.. అమరావతి ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పార్టీ అధ్యక్షుడి పర్యటన సందర్భంగా చంద్రబాబుకు స్వాగతం పలుకుతూ టీడీపీ శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
అయితే దీనికి ప్రతిగా ఆ ఫ్లెక్సీల ముందు వైసీపీ కార్యకర్తలు కొందరు చంద్రబాబు నాయుడు పర్యటనను వ్యతిరేకిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. చంద్రబాబును దళిత ద్రోహిగా పేర్కొంటూ పోస్టర్లు అంటించడంతో పాటు, గో బ్యాక్ చంద్రబాబు అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వివాదాస్పదమైంది. మరోవైపు ఆయన పర్యటనను అడ్డుకుంటామని స్థానిక వైసీపీ నాయకులు ప్రకటించడంతో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు పర్యటన సజావుగా సాగుతోందా లేదా అన్న సందిగ్ధత నెలకొంది. ఇక చంద్రబాబుకు వ్యతిరేకంగా పెట్టిన ఫ్లెక్సీలను తొలగించాలంటూ టీడీపీ కార్యకర్తలు అమరావతిలో నిరసన తెలిపారు. పోటాపోటీ ప్లెక్సీల ఏర్పాటుతో అప్రమత్తమైన పోలీసులు అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున మోహరించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE