కామన్ వెల్త్ గేమ్స్-2022 లో భారత్ రెజ్లర్లు మరోసారి అదరగొడుతూ పతకాల వేట కొనసాగించారు. గేమ్స్ లో ఎనిమిదవ రోజైన ఆగస్టు 5, శుక్రవారం నాడు మూడు స్వర్ణాలు, ఒక రజతం, రెండు కాంస్యాలు సాధించి మొత్తం ఆరు పతకాలతో భారత్ రెజ్లర్లు సత్తా చాటారు. భజరంగ్ పూనియా, దీపక్ పునియా, సాక్షి మాలిక్ స్వర్ణ పతకాలు సొంతం చేసుకోగా, అన్షు మాలిక్ రజతం, దివ్య కక్రాన్, మోహిత్ గ్రెవాల్ కాంస్య పతకాలు గెలుచుకున్నారు. దీంతో ఇప్పటివరకు భారత్ ఖాతాలో 9 స్వర్ణ, 8 రజత, 9 కాంస్యలతో కలిపి మొత్తం 26 పతకాలు చేరాయి.
శనివారం రాత్రి జరిగిన పురుషుల ఫ్రీ స్టైల్ రెజ్లింగ్ 65 కేజీల విభాగంలో ఫైనల్లో కెనడా కు చెందిన లాచ్లాన్ మెక్నీల్ను 9-2తో ఓడించిన భజరంగ్ పూనియా స్వర్ణ పతకం గెలుచుకున్నాడు. దీంతో కామన్ వెల్త్ గేమ్స్ లో భజరంగ్ మూడో పతకం సాధించగా, వరుసగా 2వ స్వర్ణాన్ని దక్కించుకున్నాడు. 2014లో 61 కేజీల విభాగంలో భజరంగ్ రజతం నెగ్గాడు. పురుషుల ఫ్రీ స్టైల్ రెజ్లింగ్ 86 కేజీల విభాగంలో పాకిస్థాన్కు చెందిన ముహమ్మద్ ఇనామ్ను 3-0తో ఓడించిన దీపక్ పునియా స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. కామన్ వెల్త్ గేమ్స్ లో మొదటిసారి పాల్గొన్న దీపక్ పునియా ఫైనల్లో 2 సార్లు సీడబ్ల్యూజీ ఛాంపియన్గా నిలిచిన ముహమ్మద్ ఇనామ్ను ఓడించాడు. మహిళల రెజ్లింగ్ 62 కేజీల ఫైనల్లో కెనడాకు చెందిన అండర్-23 ప్రపంచ ఛాంపియన్ అనా పౌలా గోడినెజ్ను ఓడించి సాక్షి మాలిక్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. ముందుగా 0-4తో వెనకబడిన సాక్షి మాలిక్ అనంతరం ఒక్కసారిగా ప్రత్యర్థిని ఎత్తిపడేసి, పిన్ చేసి విజయాన్ని దక్కించుకుంది. 2014లో రజతం, 2018 లో కాంస్యం సాధించిన సాక్షి మాలిక్ తాజా 2022 ఎడిషన్ లో మొదటిసారి స్వర్ణాన్ని గెలుచుకుంది.
మరోవైపు మహిళల రెజ్లింగ్ 57 కేజీల ఫైనల్లో అన్షు మాలిక్ 4-7తో నైజీరియాకు చెందిన 2 సార్లు సీడబ్ల్యూజీ ఛాంపియన్ అయిన ఒడునాయో చేతిలో ఓడిపోయింది. అన్షు తన శక్తివంచన లేకుండా పోరాడినప్పటికీ ప్రత్యర్థి ముందు నిలవలేకపోయింది. దీంతో రజతాన్ని కైవసం చేసుకుంది. అన్షు సీడబ్ల్యూజీ గేమ్స్ లో పాల్గొనడం ఇదే మొదటిసారి. ఇక మహిళల రెజ్లింగ్ 68 కేజీల విభాగం కాంస్య పోరులో తన ప్రత్యర్థి టోంగాకు చెందిన రెజ్లర్ టైగర్ లైలీని 26 సెకండ్లలోనే మట్టికరిపించిన దివ్య కక్రాన్ కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. 2018 లో కూడా దివ్య కక్రాన్ కాంస్యం సాధించింది. అలాగే పురుషుల ఫ్రీ స్టైల్ రెజ్లింగ్ 125 కేజీల విభాగం కాంస్య పోరులో జమైకాకు చెందిన ఆరోన్ ను 6-0తో ఓడించి మోహిత్ గ్రేవాల్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. పతకాలు దక్కించుకున్న భారత్ రెజ్లర్లకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు అభినందనలు తెలియజేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY