రాజకీయాల్లో అధికారం వచ్చాక ప్రజల ఆశీస్సులతో ప్రజాభీష్టానికి అనుగుణంగా వ్యవహరిస్తారు. కానీ ఏపీలో మాత్రం గడిచిన ఐదేళ్ల పాలన అందుకు విరుద్ధంగా సాగింది. జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశలను అడియాశలు చేసిందన్న విమర్శలు మూటగట్టుకుంది. అనేక రంగాల్లో రాష్ట్రాన్ని దిగజార్చడంతో పాటు… చివరకు రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయింది. దేశమంతా ఏపీ వాసులను ఎగతాళి చేసే స్థాయికి చేరింది. స్వయంగా ఓ హైకోర్టు జడ్జిగారే తన అనుభవాన్ని బహిరంగంగా వెల్లడించిన విషయం గుర్తు చేసుకుంటే ఏపీ ప్రజల పరువు తీసిన పాలన మనకు అర్థమవుతుంది.
ఇటు వ్యవసాయం కునారిల్లిపోయి.. రైతన్న దిక్కుతోచని స్థితిలోకి నెట్టబడ్డారు. చంద్రబాబు హయాంలో పోలవరం పనులు వేగవంతం చేయడమే కాదు.. పట్టిసీమతో కృష్ణా డెల్టాను, పురుషోత్తపట్నం ప్రాజెక్టుతో విశాఖ నగరాన్ని పునీతం చేసిన ఘనత మనం విస్మరించకూడదు. కానీ ఈ ఐదేళ్లలో ఏం సాధించారా అంటే పెదవి విరిపు తప్ప ఏమీ మిగల్లేదు. చివరకు వెలిగొండ ప్రాజెక్టు సైతం పూర్తి చేయలేక కేవలం ప్రచారం కోసం ఓ పునాది రాయి వేసి చేతులు దులుపుకున్నారు.
2020 నాటికే టన్నెల్ పనులు పూర్తయినా నాలుగేళ్లలో ఒక్క నీటి చుక్క ఇవ్వకుండా ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలో దుర్బిక్ష ప్రాంతాలను దగా చేశారు. ఈ రోజు పరిస్థితి చూస్తుంటే ఆఖరికి గోదావరి– కృష్ణా డెల్టాల్లో కూడా సాగునీరు లేక రబీ పంటలు గట్టెక్కడం ఎలా అన్నది అంతుబట్టడం లేదు. రాష్ట్రమంతా కరవు ప్రభావం ఉన్నప్పటికీ కేవలం 87 మండలాలను కరవు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించి చేతులు దులుపుకున్నారు. నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో అత్యదికంగా కరవు ప్రభావం ఉన్నప్పటికీ కనీసం సహాయక చర్యలు కూడా లేవు.
యువతను వంచించి, మహిళకు దశా-దిశా లేకుండా చేసి, ఉద్యోగులను దగా చేసి, కార్మికులను మోసగించిన ఈ పాలనలో ప్రచారం తప్ప పనులు లేవని స్పష్టమయ్యింది. అయినా కూడా బటన్ నొక్కుడు పేరుతో మళ్లీ జనం గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. ఐదేళ్ల అప్రజాస్వామిక పాలనలో నియంతలా వ్యవహరించిన నాయకుడి గురించి సంక్షేమం మాటున మరోసారి చేజేతులా నాశనం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రజలు కళ్ళు తెరిచి వాస్తవాలను చూడకపోతే ప్రచారంతో పక్కదారి పట్టించే ప్రయత్నానికి ఒడిగడుతున్నారు.
రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి లేదు. వ్యవసాయాభివృద్ధి కనుమరుగయ్యింది. అప్పుల కుప్పలా తయారయ్యింది. అయినప్పటికీ సంక్షేమం అంటూ చంకలు గుద్దుకుంటున్నారు వైసీపీ నేతలు. వివిధ తరగతులకు అందాల్సిన పథకాల పేరు మార్చి ప్రజలను ఏమార్చడం మినహా ఈ ప్రభుత్వం సాధించింది లేదు. చివరకు ఎస్సీలకు కూడా 27 పథకాలను ఎగనామం పెట్టేసింది. బీసీలకు కార్పోరేషన్లకు కాసులు లేకుండా చేసింది. కేవలం సాధికారత అంటూ కబుర్లు చెప్పడం మినహా నిధులు ఇవ్వాలన్న ధ్యాస కూడా లేని దగా పాలనగా సాగిందన్న విమర్శలు మూట గట్టుకుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY