టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ను పోలీసులు గన్నవరం సబ్జైలుకు తరలించారు. పట్టాభిపై హత్యాయత్నంతో పాటు ఎస్సీ, ఎస్టీ యాక్టు కేసులు నమోదు చేసిన పోలీసులు బుధవారం ఉదయం గన్నవరం కోర్టుకు తీసుకొచ్చారు. ఈ క్రమంలో కొమ్మారెడ్డి పట్టాభిని సివిల్ కోర్టు జడ్జి ఎదుట హాజరుపరచగా.. పట్టాభితో పాటు మరో 13 మందికి న్యాయమూర్తి రిమాండ్ విధించారు. కాగా రెండు రోజుల క్రితం గన్నవరంలో గొడవలు జరిగిన విషయం తెలిసిందే. కాగా పట్టాభిని తొలుత మంగళవారం కోర్టులో హాజరుపరచగా, పోలీసులు తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆయన న్యాయమూర్తికి విన్నవించారు. దీంతో పట్టాభిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి మెడికల్ రిపోర్టు ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఈ నేపథ్యంలో పట్టాభిని నిన్న రాత్రి గన్నవరం పోలీస్ స్టేషన్లోనే ఉంచారు.
ఇక ఈ ఉదయం పోలీసులు పట్టాభిని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో ఈరోజు వైద్య నివేదికతో పాటు పట్టాభిని మరలా గన్నవరం అదనపు మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ న్యాయస్థానంలో హాజరుపరిచారు. పట్టాభికి సంబంధించిన మెడికల్ రిపోర్టును పరిశీలించిన న్యాయమూర్తి ఆయనను గన్నవరం సబ్ జైలుకు తరలించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. అయితే పోలీసులు పట్టాభిని గన్నవరం సబ్ జైలులో ఉంచితే శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని, అందుకే ఆయనను వేరే జైలుకు తరలించాలని న్యాయమూర్తిని కోరారు. కానీ పోలీసుల వినతిని తిరస్కరించిన న్యాయమూర్తి వచ్చే నెల 14వ తేదీ వరకు పట్టాభికి రిమాండ్ విధించారు. దీంతో కోర్టు ఆదేశాల మేరకు పట్టాభితో పాటు మిగిలిన 13 మందిని కూడా పోలీసులు గన్నవరం సబ్ జైలుకు తరలించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE