ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అనూహ్య పరిణామాల మధ్య గురువారం గొల్లపూడిలోని తెలుగుదేశం పార్టీ (టీడీపీ) కార్యాలయాన్ని జిల్లా పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దీంతో భారీ బందోబస్త్ ఏర్పాటు చేసిన పోలీసులు ఎక్కడిక్కడ టీడీపీ కార్యకర్తలను అడ్డుకుంటున్నారు. రెవెన్యూ సిబ్బంది నేతృత్వంలో పోలీసులు గొల్లపూడి వన్ సెంటర్లోని టీడీపీ కార్యాలయం తరలింపును చేపడుతున్నారు. కాగా గత రెండు రోజులుగా ఆఫీస్ ఏర్పాటు చేసిన స్థలంపై యాజమాన్యం మధ్య వివాదం చోటు చేసుకుంది. లీజుదారుడు శేషారత్నం, కుమారుడు తన సంక్షేమాన్ని విస్మరించడంతో కలెక్టర్ ద్వారా గిఫ్ట్ డీడ్ను రద్దు చేయించారు. దీంతో కలెక్టర్ ఆదేశాలతో పోలీసులు ఈరోజు టీడీపీ కార్యాలయాన్ని ఖాళీ చేయిస్తున్నారు. ఇక ప్రస్తుతం గొల్లపూడి వన్ సెంటర్లోని రహదారులు ఇరువైపులా.. పోలీసులు ఎవ్వరినీ లోపలికి అనుమతించడం లేదు.
ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే ఉమా నివాసానికి వెళ్లే రహదారిని భారీ గేట్లతో మూసివేశారు. ఈ సందర్భంగా దేవినేని ఉమా మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని సంతోషపెట్టడానికే పోలీసులు టీడీపీ కార్యాలయాన్ని తరలిస్తున్నారని, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాయని విమర్శించారు. ఇక పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీ కార్యాలయం ఇదే స్థలంలో ఉందని, రాజకీయ కుట్రలో భాగంగానే ఫిర్యాదు ఇవ్వగానే అధికారులు ఆఘమేఘాలపై స్పందించి కార్యాలయంలోని సామాగ్రిని బయట పడేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ వర్థంతి కార్యక్రమం ఘనంగా జరగకుండా ఆపడానికే తొలగింపు చేపట్టారని దేవినేని ఉమా ఆరోపించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE