సినీ నటుడు నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ మరియు ఆయన సోదరుడు కళ్యాణ్రామ్ ఇద్దరూ ఆదివారం బెంగళూరు చేరుకున్నారు. ప్రస్తుతం తారకరత్నకు చికిత్స అందిస్తున్న నారాయణ హృదయాలయ ఆస్పత్రికి వెళ్లి తారకరత్నను పరామర్శించారు. వైద్యులను అడిగి తారకరత్న ఆరోగ్యం, చికిత్స గురించి వాకబు చేశారు. కాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేతృత్వంలో చిత్తూరు జిల్లా కుప్పంలో శుక్రవారం మొదలైన యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న అస్వస్థతకు లోనై ఒక్కసారిగా కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తొలుత ప్రాథమిక చికిత్స కోసం కుప్పం పట్టణంలోని పీఈఎస్ ఆస్పత్రిలో చేర్పించగా.. అనంతరం వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం ఆయనను శుక్రవారం అర్ధరాత్రి బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు.
అప్పటినుంచి చికిత్స తీసుకుంటున్న ఆయన ఆరోగ్యం అంతకంతకూ విషమిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. శనివారం మధ్యాహ్నం విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో.. మయోకార్డియల్ ఇన్ఫార్క్ షన్ కారణంగా తారకరత్న తీవ్ర గుండెపోటుకు గురయ్యారని, ఆయన పరిస్థితి తీవ్ర విషమంగా ఉందని వైద్యులు ప్రకటించారు. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హుటాహుటిన హైదరాబాద్ నుంచి బయలుదేరి బెంగళూరు చేరుకున్నారు. తారకరత్నను పరామర్శించి వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అక్కడే ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తూ తారకరత్న కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఇక అంతకుముందు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి ఫోన్ చేసిన చంద్రబాబు తారకరత్న ఆరోగ్యపరిస్థితి గురించి వివరించి అంబులెన్స్ మార్గంలో గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన సీఎం బొమ్మై ఈ మేరకు పోలీసులకు ఆదేశాలు జారీ చేయగా.. గంటన్నర వ్యవధిలో తారకరత్నను నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE