ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జూన్ 11, గురువారం ఉదయం 11 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేబినేట్ భేటీలో చర్చించే అంశాలపై అన్ని శాఖలకు సంబంధించి నివేదికలు పంపాలని ఆయా శాఖల అధికారులను సీఎస్ నీలం సాహ్ని ఆదేశించారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలో సుదీర్ఘ లాక్డౌన్ అమలు అనంతరం తొలిసారిగా కేబినెట్ సమావేశం జరగబోతుంది.
పూర్తి స్థాయి బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, సంబంధిత తేదీలపై ఈ సమావేశంలో చర్చించి ఖరారు చేయనున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలను నిర్వహించలేక పోవడంతో మూడు నెలల వ్యయంపై ఆర్డినెన్స్ తీసుకురాగా గవర్నర్ ఆమోదం తెలిపారు. ఈనెల చివరికి బడ్జెట్ వ్యయానికి గడువు ముగుస్తున్న నేపథ్యంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిర్వహించాల్సి ఉండడంతో, ఈ అంశంపై కేబినేట్ సమావేశంలో కీలకంగా చర్చించే అవకాశం ఉంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu