టీడీపీ నాయకుడు, కృష్ణాజిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అక్టోబర్ 27ఆదివారం నాడు టీడీపీ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అంతే కాకుండా రాజకీయాల నుంచి పూర్తి స్థాయిలో తప్పుకుంటున్నట్లు కూడ వంశీ ప్రకటించారు. ఆయన తన రాజీనామా లేఖను టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు పంపారు. టీడీపీ ప్రాధమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి గల కారణాలను లేఖలో వివరించారు. వంశీ ప్రకటనతో గన్నవరం నియోజకవర్గంలో రాజకీయంగా వేడి మొదలైంది. ఆయన రాజీనామాతో టీడీపీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లేనని పరిశీలకులు భావిస్తున్నారు.
స్థానిక వైసీపీ నాయకులు, కొందరు ప్రభుత్వ అధికారుల వైఖరి వల్ల తన అనుచరులు, మద్దతుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వంశీ లేఖలో పేర్కొన్నారు. వారి ఇబ్బందులు తొలగించేందుకు వేరే వాళ్లతో చేతులు కలిపే అవకాశం ఉన్న కూడ తన మనసాక్షి అంగీకరించడం లేదని, అందుకే రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకునట్టు తెలిపారు. అయితే వల్లభనేని వంశీ రాసిన లేఖపై చంద్రబాబు నాయుడు స్పందించారు. లేఖలో వంశీ పేర్కొన్న అంశాలకు ఆయన బదులిచ్చారు. వైసీపీ వేధింపులను, మీకు జరిగిన అన్యాయాన్ని కలిసికట్టుగా ఎదుర్కొందాం. పార్టీ పరంగా అండగా ఉంటానని ఆయన తెలిపారు. అనంతరం వంశీ సైతం, తాను రాసిన లేఖ పట్ల స్పందించినందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీలో తన సేవల్ని గుర్తించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ మరో లేఖ రాసారు. ఇందులో ఆయన పార్టీ పరంగా ఎదురుకున్న పలు అంశాలను ప్రస్తావించారు. వల్లభనేని వంశీ రాజీనామా వ్యవహారం ఇకపై ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.
[subscribe]