ఆంధ్రప్రదేశ్లో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల సమరం హోరాహోరీగా సాగుతోంది. అఽధికారం కోసం అధికారపార్టీ, తెలుగుదేశం కూటమి విస్తృతంగా ప్రచారం సాగిస్తున్నాయి. వైనాట్ 175 అంటూ వైసీపీ ప్రచారం చేస్తుంటే.. కూటమిదే అధికారం అని తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతలు చెబుతున్నారు. రోడ్షోలు, బస్సు యాత్రలు, సభలు, సమావేశాలతో జోరుగా ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. ఒకరి వైఫల్యాలను మరొకరు ఎండగడుతూ.. ఎవరి గొప్పలను వారు చెప్పుకుంటూ.. ప్రజలను ఆకర్షించేందుకు పాట్లు పడుతున్నారు. మరోసారి అధికారంలోకి వచ్చేందుకు వైసీపీ తాపత్రయం పడుతుంటే, ఒక్కచాన్స్ అని అధికారం ఇచ్చినందుకు రాష్ట్రం పదేళ్లు వెనక్కిపోయిందంటూ టీడీపీ పేర్కొంటోంది.
ఇదిలాఉండగా.., అటు వైసీపీ, ఇటు తెలుగుదేశం, జనసేన.. ఏ పార్టీ అయినా, ఏ సభ అయినా జనం మాత్రం తండోపతండాలుగా ఉంటున్నారు. కానీ.. అధికార, విపక్ష నేతలు ‘మన సభలు గలగల.. వారి సభలు వెలవెల’ అంటూ సెటైర్లు వేసుకుంటున్నారు. కర్నూలు జిల్లాలో టీడీపీ ఆదివారం నిర్వహించిన ‘ప్రజాగళం’ బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. జగన్ సభలకు జనం రావడం లేదని విమర్శించారు. వైసీపీ ఎక్కడ సభలు, యాత్రలు నిర్వహించినా వెలవెలబోతున్నాయని, ప్రభుత్వంపై వ్యతిరేకతకు ఇదే నిదర్శనమని ప్రచారం చేశారు. అలాగే.. వైసీపీ నేతలు కూడా టీడీపీ సభలపై ఇదే తరహా ప్రచారం సాగిస్తున్నారు. జనం రాక ఆ పార్టీ కార్యక్రమాలు అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయని చెబుతున్నారు.
నేతలపై విమర్శలతో పాటు.. సభలు ఫెయిల్ అంటూ ప్రచారం చేయడం ద్వారా చర్చకు దారితీసేలా వ్యూహాత్మకంగా ముఖ్యనేతలు వ్యవహరిస్తున్నారు. అలాగే వైసీపీ ప్రభుత్వాన్ని చిత్తుచిత్తుగా ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని టీడీపీ.., చంద్రబాబు పని ఇక అయిపోయిందని, ఆయనను నమ్మేస్థితిలో ఏపీవాసులు లేరని వైసీపీ.. కౌంటర్లు, ఎన్కౌంటర్లు వేస్తున్నాయి. దీంతోపాటు ప్రజలను ఆకట్టుకునేందుకు పోటాపోటీగా హామీలు గుప్పిస్తాయి. కూటమి అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీపై తొలి సంతకం పెడతానని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పదేపదే చెబుతున్నారు. మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే ఇప్పుడున్న సంక్షేమ పథకాలకు నిధులు పెంచడంతో పాటు, మరింత గొప్పగా పాలన సాగిస్తామని జగన్ పేర్కొంటున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY