తెలంగాణ రాజకీయాల్లో మొదటి నుంచీ కూడా మెదక్ పార్లమెంట్ స్ధానానికి ఎంతో ప్రత్యేకత ఉంది. గులాబీ కంచుకోటగా చెప్పుకునే మెదక్ నుంచి బీఆర్ఎస్ విజయాల పరంపర కొనసాగుతోంది. అందుకే బీఆర్ఎస్ కంచుకోటగా చెప్పుకోవాల్సిన స్థానాల్లో మెదక్ పేరు ముందుంటుంది.అయితే ఇప్పుడు జరుగుతున్న పార్లమెంటు ఎన్నికలలో ఈసారి ఆసక్తికర పోరు జరుగుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి బరిలో దిగగా.. బీజేపీ నుంచి రఘునందన్ రావు, కాంగ్రెస్ పార్టీ నుంచి నీలం మధు పోటీలో నిలిచారు.
దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 1980లో మెదక్ నియోజకవర్గం నుంచి గెలుపొందగా.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మెదక్ ఎంపీగా విజయం సాధించారు. 1952లో మెదక్ లోక్సభ నియోజకవర్గం ఏర్పడగా .. రాష్ట్రం విడిపోకముందు 9 సార్లు కాంగ్రెస్ గెలుపొందగా.. 2004 నుంచి ఇప్పటి వరకూ బీఆర్ఎస్కు తిరుగేలేకుండా పోయింది.కానీ ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ హవాకు చెక్ పెట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దీంతో ఆ ఫలితాలే పార్లమెంట్ ఎన్నికలలో కూడా రిపీట్ అవుతాయా అన్న అనుమానాలు కారు పార్టీలో గుబులు పుట్టిస్తోంది.
మెదక్ పార్లమెంట్ పరిధిలో సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, నర్సాపూర్, పటానుచెరు, సంగారెడ్డి నియోజకవర్గాలు ఉన్నాయి. మెదక్ పార్లమెంట్ పరిధిలో 18 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అలాగే మెదక్ పార్లమెంట్ పరిధిలో ముఖ్యంగా..కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోరు జరగనుండటంతో.. విజయం ఎవరిని వరిస్తుందోనన్న ఆసక్తి అందరిలో నెలకొంది.
ఆపరేషన్ ఆకర్ష్తో పెద్ద ఎత్తున బీజేపీ, బీఆర్ఎస్ నేతలను చేర్చుకుంటూ కాంగ్రెస్ దూసుకుపోతూ ఉండగా.. తన సెంటిమెంట్ అయిన మెదక్ ను తమ కంచుకోటగా నిలుపుకోవాలని బీఆర్ఎస్ భావిస్తోంది. మరొక్కసారి మెదక్ సీటును గెలిచి తమ సత్తా చాటాలని గులాబీ పార్టీ భావిస్తోంది. దీంతోనే వెంకట్రామిరెడ్డి గెలుపు బాధ్యతను హరీష్ రావు తీసుకోగా… బీజేపీ అభ్యర్థి రఘునందన్రావు కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. దీంతో ఈ త్రిముఖ పోరులో గెలుపు ఎవరిని వరిస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY