ఈ రోజు లోక్ సభలో కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ తమకు నిరాశ కలిగించిందని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి అన్నారు. ముఖ్యంగా వ్యవసాయంపై ఆధారపడిఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ బడ్జెట్ వలన ఉపయోగం ఉండదని చెప్పారు. లోక్ సభలో బడ్జెట్ ప్రసంగం ముగిసిన అనంతరం వైసీపీ ఎంపీలతో పార్లమెంట్ ఆవరణలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. దేశంలో ద్రవ్యోల్బణం పెరగడం మంచి పరిణామం కాదని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్ 2020-21లో వ్యవసాయరంగానికి ప్రకటించిన కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన వాటాను కచ్చితంగా ఇవ్వాలని చెప్పారు. బడ్జెట్లో ప్రతికూల అంశాలతో పాటుగా కొన్ని అనుకూల అంశాలు కూడా ఉన్నాయన్నారు. బ్యాంకు డిపాజిట్లపై బీమాను లక్ష నుంచి 5 లక్షలకు పెంచడం మంచి పరిణామమని విజయసాయి రెడ్డి చెప్పారు. మరోవైపు బడ్జెట్ పై టీడీపీ ఎంపీ కేశినేని నాని స్పందిస్తూ, ఏపీకి మళ్ళీ మొండి చేయి ఎదురైందని అన్నారు. బడ్జెట్ ప్రసంగంలో ఎక్కడా కూడా ఏపీ ప్రస్తావనే లేదని విమర్శించారు.
[subscribe]