ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కోవిడ్-19(కరోనా వైరస్) తీవ్ర ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. భారత్ లో ఇప్పటికే 4421 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా, ఈ వైరస్ వలన 117 మంది మరణించారు. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ పై వస్తున్న వార్తలు, తీసుకోవాల్సిన మరికొన్ని జాగ్రత్తలపై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మంగళవారం నాడు వరుస ట్వీట్స్ చేశారు. సామాజిక దూరం (సోషల్ డిస్టాన్సింగ్) పాటించడం, పరిశుభ్రంగా ఉండటంతోపాటుగా భయానికి దూరంగా ఉంచడం, ఆందోళన మరియు భయాన్ని కలిగించే వ్యక్తులకు, వార్తలకు దూరంగా ఉండడం ముఖ్యమని ప్రజలకు సూచించారు.
” రెండు వారాల లాక్ డౌన్ సమయంలో మనం మరింత బలంగా ముందుకెళ్తున్నాం. ఐక్యతతో పనిచేస్తున్న మన ప్రభుత్వాలను ఎంతో అభినందిస్తున్నాను. ఈ రోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మనమంతా ఆరోగ్యంగా ఉండేందుకు కోవిడ్ -19తో పోరాడుతూ ఈ పోరాటంలో ముందున్న వారందరికీ కృతజ్ఞతలు తెలియజేద్దాం. ఈ ఆరోగ్య సంక్షోభ సమయంలో మన జీవితాలను కాపాడడానికి వీధులు మరియు ఆసుపత్రులలోని సేవలు అందిస్తున్న యోధులందరిని చాలా గౌరవిద్దాం. ఆ భగవంతుడు ఆశీర్వచనాలు మీ అందరికి (వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య సిబ్బంది) ఉంటాయని” మహేష్ బాబు పేర్కొన్నారు.
“ఈ లాక్ డౌన్ సమయంలో సామాజిక దూరం మరియు మంచి పరిశుభ్రత పాటించడంతో పాటుగా మనం దృష్టిలో ఉంచుకోవాల్సిన, అవసరమైన ముఖ్యమైన విషయం ఇంకోటి కూడా ఉంది. ఫియర్ డిస్టాన్సింగ్ – భయాందోళనలు మరియు భయాన్ని సృష్టించే వ్యక్తుల నుండి మరియు వార్తలకు మనం దూరంగా ఉండాలి. నకిలీ వార్తలే ఇప్పుడు నిజమైన సమస్య, తప్పుదారి పట్టించే సమాచారానికి దూరంగా ఉండండి. ఇది ప్రతి ఒక్కరు చదివి పాజిటివిటీ, ప్రేమ, ఆశ మరియు సానుభూతి వ్యాప్తి చేయాలని కోరుతున్నానని” మహేష్ బాబు నెటిజన్లను కోరారు.
[subscribe]