ఖమ్మం జిల్లాలో మొట్టమొదటి కరోనా పాజిటివ్ కేసు నమోదు అవ్వడంతో తదుపరిగా తీసుకోవాల్సిన చర్యలపై ఏప్రిల్ 7, మంగళవారం నాడు ఖమ్మం కలెక్టరేట్ ప్రజ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్, పోలీసు కమీషనర్ తఫ్సీర్ ఇక్బాల్, డిహెఛ్ఎంవో శ్రీమతి మాలతి మరియు వైద్య అధికారులతో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయకుమార్ సమావేశం నిర్వహించారు. కరోనా వైరస్ వ్యాప్తి నుండి ఖమ్మం జిల్లాను సురక్షితంగా ఉంచేందుకు ప్రజలు స్వచ్ఛందంగా సహకరించాలని ఈ సందర్భంగా పువ్వాడ అజయకుమార్ కోరారు.
అనంతరం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యల ఫలితంగా నెలరోజుల వరకు కూడా ఖమ్మం జిల్లా పాజిటీవ్ కేసు రాలేదు, ఢిల్లీ వెళ్ళి వచ్చిన ఖమ్మం రూరల్ మండలం కు చెందిన వ్యక్తి కి పాజిటీవ్ ఉన్నట్లు సోమవారం రిపోర్టు వచ్చిన వెంటనే ఆ వ్యక్తిని గాంధీ అసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించామని మంత్రి చెప్పారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తితో పాటు ఐసోలేషన్ లో ఉన్న 12 మందికి నెగటివ్ రిపోర్టు వచ్చిందని, జిల్లాలో పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని, ప్రజలు భయాందోళనకు గురికావాల్సిన పని లేదని మంత్రి తెలిపారు. వైరస్ ను పూర్తిగా కట్టడి చేసేందుకు స్వీయ నిర్భందం ఒక్కటే మార్గమని, ప్రజలు నియంత్రణ, సామాజిక దూరాన్ని తప్పనిసరిగా పాటించాలని మంత్రి పువ్వాడ కోరారు. ప్రజలకు అవసరమైన నిత్యావసరమైన వస్తువులు, కూరగాయలు డివిజన్ల పరిధిలోనే లభించే విధంగా ఏర్పాట్లు చేశామని, నగరంలోని ప్రజలు రోడ్ల పైకి రావద్దని అన్నారు. వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో జిల్లా యంత్రాంగానికి మీడియా పూర్తిగా సహకరించాలని, జిల్లా యంత్రాంగం అధికారికంగా ధృవీకరించిన తర్వాతనే వైరస్ కి సంబంధించిన వార్తలు ప్రసారం చేయాలని మంత్రి మీడియాను కోరారు.
ఖమ్మం రూరల్ మండలం పెద్దతండాలో 45 సంవత్సరాల వ్యక్తికి పాజిటివ్ కేసు నమోదు అయిన నేపథ్యంలో ఆ వ్యక్తి ఇతరులతో కలిసిన వివరాలను సేకరించి వారి నమూనాలను నిర్ధారణకు పంపడం జరిగిందని చెప్పారు. పెద్దతండాలో స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్ నేతృత్వంలో 19 బృందాలు స్ధానికులను పూర్తిగా పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. దీనితోపాటు రఘునాధపాలెం, నేలకొండపల్లి ప్రాంతాలలో కూడా సర్వే చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. మైనర్ కాంటాక్ట్ కలిగిన వారి నమూనాలను పరీక్షకు పంపడం జరిగిందని, సెకండరీ కాంటాక్ట్ ఉన్న వారు స్వచ్చందంగా పరీక్షలు నిర్వహించుకునేందుకు ముందుకు రావాలని ఈ సందర్భంగా మంత్రి కోరారు. లాక్ డౌన్ ను మరింత పటిష్టంగా అమలు చేస్తున్నామని నేటి నుండి ఉదయం 11.00 గంటల వరకే నిత్యవసర వస్తువులు, కూరగాయలు, మాంసం దుకాణాలు అనుమతిస్తున్నామని, 11.00 గంటల తర్వాత కేవలం మెడికల్ షాపులు మాత్రమే తెరిచి ఉంటాయని ప్రజలెవ్వరూ అనవసరంగా బయటికి రావద్దని అన్నారు. ఆందరూ మాస్క్ లు ధరించాలని, సామాజిక దూరాన్ని పాటించాలన్నారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఇప్పటికే జిల్లా యంత్రాంగం అన్ని చర్యలతో సిద్ధంగా ఉందని, 4 వందల పడకల ఐసోలేషన్, పరిస్థితులకు సరిపడే క్వారంటైన్ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు.