దేశ వ్యాప్తంగా పార్లమెంట్ సభ్యులు లోక్సభ మరియు రాజ్యసభల్లో ప్రజలకు ప్రాతినిథ్యం వహిస్తుంటారు. లోక్ సభ సభ్యుల ఎన్నిక ప్రజలచేత ప్రత్యక్షంగాను, రాజ్యసభ సభ్యుల ఎన్నిక ఆయా పార్టీల అధినేత ఆమోదంతో పరోక్ష విధానంలోనూ జరుగుతూ ఉంటాయి. ఇలా ఎన్నిక కాబడిన పలువురు రాజ్యసభ సభ్యుల ఆస్తిపాస్తులు వింటే దిమ్మతిరగాల్సిందే.
రాజ్యసభకు ఎన్నికైన, నామినేట్ అయిన ఎంపీల ఎన్నికల అఫిడవిట్స్ను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) విశ్లేషించింది. 233 మంది MPలలో 225 మంది సగటు ఆస్తులు రూ.80.93 కోట్లుగా ఉన్నట్లు నివేదించింది. 27 మంది ఎంపీలు కోటీశ్వరులు కాగా వీరిలోనూ 11 మంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు మహారాష్ట్రల నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ మొత్తం కోటీశ్వరుల్లో అత్యంత ధనవంతులుగా బీఆర్ఎస్ ఎంపీ బండి పార్థసారథి రికార్డు సృష్టించారు. ఆయన ఆస్తుల విలువ ఏకంగా 5 వేల 300 కోట్లకు పైమాటే. 2 వేల 577 కోట్లతో ఆంధ్రప్రదేశ్లోని వైఎస్సార్ కాంగ్రెస్కు చెందిన అయోధ్య రామిరెడ్డి రెండో స్థానంలో కొనసాగుతున్నారు. ఎస్పీకి చెందిన జయా బచ్చన్ 1,001.63 కోట్లతో తరువాతి స్థానం దక్కించుకున్నారు.
10 కోట్లకుపైగా ఆస్తులున్న ఎంపీలు 84 మంది కాగా 5-10 కోట్ల మధ్య 33 మంది ఉన్నారు. 1-5 కోట్ల లోపు ఉన్నవారు 77, 20 లక్షల నుంచి కోటి మధ్య ఉన్నవారు 23 మంది అని ADR తెలిపింది. 8 మంది ఎంపీల ఆస్తులు 20 లక్షల కంటే తక్కువేనని పేర్కొంది. 3.79 లక్షల ఆస్తితో ఆప్ ఎంపీ బల్బీర్ సింగ్ అత్యంత పేదవారుగా నిలిచారు. బీజేపీ ఎంపీ మహారాజా సనజయోబా లీషెంబా 5.48 లక్షలు, మరో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ 6.60 లక్షలతో కొనసాగుతున్నారు.
రాజ్యసభలో అత్యధికంగా బిలియనీర్ ఎంపీలను కలిగి ఉన్న పార్టీ బీజేపీ. కమలం పార్టీలో ఆరుగురు, కాంగ్రెస్ నుంచి నలుగురు, వైఎస్సార్ కాంగ్రెస్లో నలుగురు ఎంపీలు ఈ కేటగిరీలో ఉన్నారు. ముగ్గురు ఆప్, టీఆర్ఎస్ ఎంపీలు, ఇద్దరు ఆర్జేడీ ఎంపీలకు 100 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు వారి ఎన్నికల అఫిడవిట్స్లో ప్రకటించారని ADR పేర్కొంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE