గుజరాత్ ముఖ్యమంత్రిగా బీజేపీ నేత భూపేంద్ర పటేల్ ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు గాంధీనగర్ లోని హెలిప్యాడ్ గ్రౌండ్లో జరిగిన కార్యక్రమంలో గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ గుజరాత్ 18వ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. కాగా గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ వరుసగా రెండోసారి బాధ్యతలు స్వీకరించారు. వైభవంగా జరిగిన ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, పలువురు బీజేపీ అగ్రనేతలు, పార్టీ అధికారంలో ఉన్న ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలు ఎన్డీఏ భాగస్వామ్య పక్ష పార్టీల నేతలు హాజరయ్యారు. అలాగే ఈ కార్యక్రమానికి ప్రజలు కూడా పెద్ద ఎత్తున హాజరయ్యారు.
మరోవైపు భూపేంద్ర పటేల్ తో పాటుగా హర్ష సంఘ్వి, జగదీష్ విశ్వకర్మ, ఖానుభాయ్ దేశాయ్,రుషికేశ్ పటేల్, భానుబెన్ బాబారియా, ముకేశ్ పటేల్, నరేష్ పటేల్, బచుభాయ్ ఖబాద్, పర్షోత్తమ్ సోలంకి సహా కొందరు గుజరాత్ బీజేపీ కీలక నేతలు కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల ముగిసిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వరుసగా ఏడవ సారి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. గుజరాత్ లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు గానూ సీఎం పీఠం దక్కించుకునేందుకు 92 స్థానాల్లో విజయం సాధించాల్సి ఉండగా, బీజేపీ 156 స్థానాల్లో విజయదుందుభి మోగించింది. కాగా కాంగ్రెస్ పార్టీ కేవలం 17 స్థానాల్లో, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) 5 స్థానాల్లో, సమాజ్ వాదీ పార్టీ ఒక స్థానంలో, ఇండిపెండెంట్స్ 3 స్థానాల్లో విజయం సాధించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం కొత్త ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ ను ఎన్నుకుంటూ బీజేపీ శాసనసభ్యులు నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే సోమవారం భూపేంద్ర పటేల్ వరుసగా రెండోసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE