మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఎస్పీజీ భద్రతను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించింది. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) భద్రతను ఉపసంహరిస్తూ ఆగస్టు 26 న కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, ఆయనకు Z+ సెక్యూరిటీ కొనసాగిస్తామని కేంద్ర హోం శాఖ పేర్కొంది. మన్మోహన్ సింగ్ ఇటీవలే రాజస్థాన్ నుండి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేశారు. నెలల తరబడి పరిస్థితిని సమీక్షించి, నిఘా వర్గాల సమాచారాన్ని విశ్లేషించిన తరువాత మన్మోహన్ సింగ్ యొక్క ఎస్పీజీ భద్రతను ఉపసంహరించుకోవాలని కేంద్ర హోం శాఖ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.
ప్రస్తుతం ఎస్పీజీ భద్రత ప్రధాని నరేంద్రమోడీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుమారుడు ఎంపీ రాహుల్ గాంధీ, ఆమె కుమార్తె ప్రియాంక గాంధీ లకు మాత్రమే కొనసాగుతుంది. గతంలో 2014 వరకు మన్మోహన్ సింగ్ సతీమణి గురుశరణ్ సింగ్, ఆయన కుమార్తెలకు ఎస్పీజీ భద్రత ఉండేది, అయితే తమకు ఎలాంటి భద్రత అవసరం లేదని స్వచ్చందంగా ప్రకటించి, ఎస్పీజీ భద్రతను వారు వెనక్కి ఇచ్చేసారు. ఇప్పుడు మన్మోహన్ సింగ్ కు భద్రత ఉపసంహరించిన తరహాలోనే గతంలో కూడ మాజీ ప్రధానులైన హెచ్డీ దేవెగౌడ, వీపీ సింగ్ లకు ఎస్పీజీ భద్రతను తీసేసారు. ఎస్పీజీ భద్రతను 1985 లో అమల్లోకి తెచ్చారు, ముప్పు ఆధారంగా మాజీ ప్రధానులకు, వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక దళంతో భద్రత కల్పిస్తారు.
[subscribe]
[youtube_video videoid=QEwukBtoIqA]