వైద్య విద్య కోర్సుల్లో రిజర్వేషన్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆల్ ఇండియా కోటాలో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు మరియు ఈడబ్ల్యూఎస్ కు(ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు) 10% రిజర్వేషన్లు కల్పించడానికి నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ గురువారం నాడు ప్రకటించింది. 2021-22 విద్యా సంవత్సరం నుండి అండర్ గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్/డెంటల్ కోర్సులకు (ఎంబీబీఎస్/ఎండీ/ఎంఎస్/డిప్లొమా/బీడీఎస్/ ఎండీఎస్) ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయని చెప్పారు. జూలై 26న జరిగిన సమావేశంలో సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఈ సమస్యకు సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖలు సమర్థవంతమైన పరిష్కారాన్ని అందించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే ఓబీసీలకు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటన చేసింది.
ఈ నిర్ణయం వలన ప్రతి సంవత్సరం ఎంబీబీఎస్ లో దాదాపు 1500 మంది ఓబీసీ విద్యార్థులకు, పోస్ట్గ్రాడ్యుయేషన్లో 2500 మంది ఓబీసీ విద్యార్థులకు, అలాగే ఎంబీబీఎస్ లో 550 మంది ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు, పోస్ట్గ్రాడ్యుయేషన్లో 1000 మంది ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఓబీసీ విద్యార్థులు ఈ నిర్ణయంతో ఏ రాష్ట్రంలోనైనా సీట్ల కోసం పోటీ పడటానికి ఆల్ ఇండియా కోటాలో ఈ రిజర్వేషన్ల ప్రయోజనాన్ని పొందగలుగుతారని చెప్పారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ