మహారాష్ట్రలో రాజకీయం రసవత్తరంగా మారింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత అజిత్ పవార్ సృష్టిస్తున్న ప్రకంపనల ప్రభావం ఇటు సొంతపార్టీతో పాటు అటు బీజేపీ-శివసేన కూటమి ప్రభుత్వాన్ని సైతం గందరగోళానికి గురిచేస్తోంది. అజిత్ పవార్ వర్గం బీజేపీతో చేతులు కలిపితే, తాము కూటమి నుంచి వైదొలగుతామని, ప్రభుత్వంలో ఉండబోమని సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన హెచ్చరించింది. ఎన్సీపీ నమ్మకద్రోహానికి పెట్టింది పేరు అని దుయ్యబట్టింది. ఈ మేరకు ఆ వర్గం ప్రతినిధి సంజయ్ శిర్సాత్ మీడియాతో మాట్లాడుతూ.. ఎన్సీపీ గురించి తమ విధానం స్పష్టంగా ఉందని తెలియజేశారు. ఎన్సీపీ ద్రోహం చేసే పార్టీ అని, అధికారంలో ఉన్నా ఎన్సీపీతో కలిసి ఉండమని తేల్చి చెప్పారు. బీజేపీ ఎన్సీపీతో చేతులు కలపడం మహారాష్ట్ర ప్రజలకు ఇష్టం లేదని, ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన.. కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ప్రజలు అంగీకరించలేదని, అందుకే ఠాక్రే వర్గాన్ని వీడి బయటకు వచ్చామని, అలాంటి పరిస్థితి ఏర్పడితే ప్రభుత్వం నుంచి బయటకు వెళ్లాలని నిర్ణయించుకున్నామని ఆయన తెలిపారు.
కాగా 16 మంది శివసేన రెబల్ ఎమ్మెల్యేల అనర్హత వేటుకు సంబంధించిన అంశం సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న నేపథ్యంలో.. త్వరలో వారికి వ్యతిరేకంగా తీర్పు రావొచ్చని బీజేపీ అంచనా వేస్తోంది. దీంతో షిండే వర్గంపై అనర్హత వేటు పడినా.. ప్రభుత్వం కూలిపోకుండా ఉండేందుకు అవసరమైన ఎమ్మెల్యేలను సమకూర్చుకునేందుకు ఇప్పటినుంచే బీజేపీ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మేనల్లుడు అజిత్ పవార్ వర్గాన్ని దగ్గరకు తీస్తోంది. అయితే ఇంతకుముందు ఒకసారి అజిత్ పవార్ వర్గం 2019 నవంబరులో బీజేపీతో చేతులు కలిపిన సంగతి తెలిసిందే. దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా, అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా అప్పట్లో ప్రమాణ స్వీకారం చేశారు. అయితే అజిత్ పవార్ వెనకడుగు వేయడంతో ఆ ప్రభుత్వం కొద్ది గంటల్లోనే కూలిపోయింది.
అనంతరం కాంగ్రెస్-శివసేన-ఎన్సీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. కానీ ఈ ప్రభుత్వం కూడా పూర్తికాలం అధికారంలో ఉండలేకపోయింది. కూటమిలోని శివసేన నుంచి ఏక్నాథ్ షిండే నేతృత్వంలో కొందరు ఎమ్మెల్యేలు వేరుపడి, బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. శివసేన నేత ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా ప్రస్తుత ప్రభుత్వం నడుస్తోంది. అయితే ఈసారి అజిత్ తమతో చేతులు కలిపితే, ముఖ్యమంత్రి పదవి అప్పగించేందుకు బీజేపీ సిద్దమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో అజిత్ వెంట ఎన్సీపీ మొత్తం 53 మంది ఎమ్మెల్యేలలో 40మందికి పైగా వస్తారని అంచనా వేస్తున్నారు. దీంతో సీఎం షిండే వర్గం మండిపడుతోంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో రాజకీయం మరోసారి ఆసక్తి రేకెత్తిస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE