ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించింది. ఈ క్రమంలో చైనాను అధిగమించి తొలిస్థానంలో నిలిచింది. కాగా భారత్లో ప్రస్తుతం చైనా కంటే అధికంగా సుమారుగా 29 లక్షల మందికి పైగా (దాదాపు 30 లక్షలు) ఉన్నారని ఐక్యరాజ్యసమితి గణాంకాలు వెల్లడించాయి. ఈ ఏడాది మధ్యలో దాదాపు 3 మిలియన్ల మంది జనాభాతో చైనాను అధిగమించి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ నిలిచిందని ఐక్యరాజ్యసమితి బుధవారం విడుదల చేసిన డేటా వెల్లడించింది. దీనిప్రకారం యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (యూఎన్ఎఫ్ఏ) ‘స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్, 2023’ నివేదికను అనుసరించి.. భారత్ జనాభా చైనాలోని 1.4257 బిలియన్ల (142.57 కోట్లు)ను దాటి 1,428.6 మిలియన్లు లేదా 1.4286 బిలియన్లు (142.86 కోట్లు)గా అంచనా వేసింది.
కాగా ఈ డేటా ఫిబ్రవరి 2023 నాటికి అందుబాటులో ఉన్న సమాచారాన్ని ప్రతిబింబిస్తుందని నివేదిక పేర్కొంది. గత ఆరు దశాబ్దాలో తొలిసారిగా 2022లో చైనా జనాభాలో తగ్గుదల నమోదవగా.. 2011 నుంచి భారత్ జనాభాలో ఏటా సగటున 1.2 శాతం వృద్ధి రేటు నమోదవుతున్నదని తెలిపింది. ఇక భారతదేశం యొక్క చివరి జనాభా గణన 2011లో నిర్వహించబడింది. అయితే 2021లో జరగాల్సిన తదుపరి లెక్కింపు కార్యక్రమం కరోనా మహమ్మారి కారణంగా ఆలస్యం అయింది. అయితే మొత్తం 8.045 బిలియన్ల ప్రపంచ జనాభాలో.. భారత్ మరియు చైనాలు మూడింట ఒక వంతు కంటే ఎక్కువ వాటా కలిగి ఉన్నప్పటికీ, ఈ రెండు దేశాల జనాభా పెరుగుదల మందగిస్తోంది. ఇది భారతదేశంలో కంటే చైనాలో మరింత ఎక్కువగా ఉంది.
కాగా ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం.. భారతదేశ జనాభాలో 0 నుంచి 14 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారు 25 శాతం ఉన్నారని, 10 నుంచి 19 ఏళ్ల మధ్య వయస్కులు 18 శాతం, 10 నుంచి 24 ఏళ్ల మధ్య వయస్కులు 26 శాతం ఉన్నారు. అలాగే ఇండియాలో 15 నుంచి 64 ఏళ్ల వయసు మధ్య ఉన్న వారు 68 శాతం మంది ఉన్నారని, 65 సంవత్సరాలకు పైబడిన వారు మొత్తం జనాభాలో దాదాపు 7 శాతంగా ఉన్నారని పేర్కొంది. అయితే భారత్ చైనాను ఎప్పుడు అధిగమించిందనే విషయాన్ని స్పష్టంగా చెప్పలేకపోతున్నామని ఐక్యరాజ్యసమితి తెలిపింది. ఇక తొలి రెండు స్థానాల్లో.. భారత్, చైనా దేశాలు నిలవగా.. 340 మిలియన్ల జనాభాతో యునైటెడ్ స్టేట్స్ (అమెరికా) మూడవ స్థానంలో ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE