తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాలనావికేంద్రీకరణలో భాగంగా కామారెడ్డి జిల్లాలో కొత్తగా మరో మండలాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు మాచారెడ్డి మండల పరిధిలోని పాల్వంచను నూతన మండలంగా ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా దీనికి సంబంధించి స్థానిక ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకోవడానికై దాదాపు ఆరు నెలల క్రితమే నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వం.. తాజాగా తుది నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్ పేరిట ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. సీఎం కేసీఆర్ అధికారంలోకి వచినప్పటినుచి తెలంగాణవ్యాప్తంగా కొత్త జిల్లాలు, మండలాలు, పంచాయతీలు ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే మూడు జాతీయ రహదారుల కూడలికి సమీపంలో ఉన్న కామారెడ్డి.. కొత్త జిల్లాగా ఆవిర్భవించింది.
ఇక కొద్ది నెలల క్రితమే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఐదు మండలాలను ఏర్పాటు చేయడం తెలిసిన విషయమే. కాగా ఇప్పటివరకు మాచారెడ్డి మండల పరిధిలో ఉన్న పాల్వంచ ఇకపై.. ఎలుపుగొండ, వాడి, ఫరీద్పేట్, బండారామేశ్వరపల్లి, ఇసాయిపేట్, దేవన్పల్లి, పోతారం, భవానిపేట్, సింగరాయ్పల్లి గ్రామ పంచాయతీలతో కలిసి కొత్తగా పాల్వంచ మండలంగా ఆవిర్భవించింది. 2019, మార్చి 30న రాష్ట్ర మంత్రి కేటీఆర్ సైతం పాల్వంచ మండల ఏర్పాటుపై కీలక ప్రకటన చేశారు. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ కృషితో, ప్రభుత్వం సహకారంతో మొత్తానికి పాల్వంచ మండలం ఏర్పాటు కావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం తాజా ఉత్తర్వులతో పాల్వంచతో కలిపి ఉమ్మడి జిల్లాలో మండలాల సంఖ్య 57కు చేరింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE