ఆఫ్రికా దేశమైన సూడాన్లో తీవ్ర అంతర్యుద్ధం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఆ దేశ ఆర్మీ, పారామిలటరీ దళాల మధ్య భీకర పోరు జరుగుతోంది. అయితే అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, దాదాపు 3,000 మంది భారతీయులు సూడాన్లోని వివిధ ప్రాంతాలలో, రాజధాని ఖార్టూమ్తో పాటు డార్ఫర్ వంటి సుదూర ప్రావిన్స్లలో చిక్కుకుపోయారు. ఈ నేపథ్యంలో అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ కావేరీ’ ప్రారంభించింది. ఈ మేరకు భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అధికారికంగా ప్రకటించారు. ‘సూడాన్లో చిక్కుకుపోయిన మన పౌరులను తిరిగి తీసుకురావడానికి ఆపరేషన్ కావేరీ ప్రారంభించబడింది. దాదాపు 500 మంది భారతీయులు పోర్ట్ సూడాన్ చేరుకున్నారు. వారి మార్గంలో మరిన్ని. మా నౌకలు మరియు విమానాలు వారిని తిరిగి ఇంటికి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాయి. సూడాన్లోని భారతీయులందరికీ సహాయం చేయడానికి కట్టుబడి ఉన్నాము’ అని జైశంకర్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ క్రమంలో భారతదేశం ఇంతకుముందు జెడ్డాలో రెండు సీ-130జే హెవీ-లిఫ్ట్ విమానాలను ఉంచింది. అలాగే ఆపరేషన్ కోసం పోర్ట్ సెడ్లో ఐఎన్ఎస్ సుమేదాను పంపింది. పోస్టు సుడాన్ నుంచి జెడ్డాకు సుమారు 278 మందిని ముందుగా తరలిస్తున్నారు. ఆహారం, నీరు మరియు విద్యుత్ కొరత కారణంగా సుడాన్లో అవసరమైన సేవలు పూర్తిగా దెబ్బతిన్న దృష్ట్యా తరలింపు అత్యవసరమైంది. కాగా సుడాన్లోని రాజకీయ సంక్షోభం ఏప్రిల్ 15న దేశవ్యాప్త సాయుధ సంఘర్షణగా మారింది. భద్రతా రంగ సంస్కరణ (ఎస్ఎస్ఆర్)పై పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (ఆర్ఎస్ఎఫ్) మరియు సుడానీస్ ఆర్మ్డ్ ఫోర్సెస్ (ఎస్ఎఎఫ్) మధ్య అసమ్మతి ఏర్పడింది. వీరి మధ్య పోరాటం తీవ్రతరం కావడంతో అనేకమంది సమీపంలోని హోటళ్లలో ఆశ్రయం పొందారు. అలాగే వందలాది మంది భారతీయులు కార్టూమ్లోని విమానాశ్రయంలో ఆశ్రయం పొందుతున్నారు. ఇక ఘర్షణల కారణంగా ఆ దేశంలో ఇప్పటికే 400 మందికిపైగా మరణించినట్లు తెలుస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE