హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. హిమాచల్ ప్రదేశ్ లో 68 అసెంబ్లీ స్థానాలకు గానూ సీఎం పీఠం దక్కించుకునేందుకు మ్యాజిక్ ఫిగర్ కింద 35 స్థానాలు దక్కించుకోవాల్సి ఉండగా, కాంగ్రెస్ పార్టీ 40 స్థానాల్లో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ నేత సుఖ్విందర్ సింగ్ సుఖు ఎంపికయ్యారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రచార కమిటీకి సుఖ్విందర్ సింగ్ సుఖు నేతృత్వం వహించారు. సీఎం రేసులో హిమాచల్ ప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు ప్రతిభా వీరభద్ర సింగ్, ముఖేష్ అగ్నిహోత్రి వంటి నేతల పేర్లు కూడా వినిపించినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం సుఖ్విందర్ సింగ్ సుఖు వైపే మొగ్గుచూపింది.
ముందుగా శనివారం సిమ్లాలో కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ హిమాచల్ ప్రదేశ్ ఇన్ఛార్జ్ రాజీవ్ శుక్లా, కాంగ్రెస్ సీనియర్ నేత భూపిందర్ సింగ్ హుడా, ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బాఘేల్, హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ ప్రతిభా వీరభద్ర సింగ్, ముఖేష్ అగ్నిహోత్రి సహా పలువురు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో సీఎంను ఎంపిక చేసే బాధ్యతను కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడికి అప్పగిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. దీంతో పార్టీ జాతీయ అధ్యక్షుడి నిర్ణయం మేరకు హిమాచల్ ప్రదేశ్ సీఎంగా సుఖ్వీందర్ సింగ్ సుఖు, డిప్యూటీ సీఎంగా ముఖేష్ అగ్నిహోత్రిని ఎంపిక చేసినట్టు కాంగ్రెస్ ప్రకటించింది.
కాగా హిమాచల్ ప్రదేశ్ సీఎంగా సుఖ్వీందర్ సింగ్ సుఖు, డిప్యూటీ సీఎంగా ముఖేష్ అగ్నిహోత్రి రేపు (డిసెంబర్ 11, ఆదివారం) ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బాఘేల్ వెల్లడించారు. అలాగే ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా హాజరవుతారని కాంగ్రెస్ సీనియర్ నేత భూపిందర్ సింగ్ హుడా తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE