ప్రపంచవ్యాప్తంగా పలుదేశాలను వణికిస్తున్న కోవిడ్-19(కరోనా వైరస్) ప్రభావం భారత్ లో కూడా క్రమ క్రమంగా పెరుగుతుంది. దేశంలో ఇప్పటి వరకు ఇరవై రెండు రాష్ట్రాల్లో 258 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ ప్రభావం దేశ పార్లమెంట్ పై కూడా పడింది. ముందుగా ప్రముఖ బాలీవుడ్ గాయని అయిన కనికా కపూర్ కు వైద్యపరీక్షల్లో కరోనా పాజిటివ్ ఉన్నట్లు గుర్తించారు. కొన్ని రోజుల క్రితం లండన్ నుంచి నుంచి లక్నో చేరుకున్న ఆమె దాదాపు 200 మంది స్నేహితులు, సన్నిహితులతో కూడిన ఓ పార్టీకి హాజరయ్యారు. ఆ పార్టీకి పలువురు రాజకీయ నాయకులు, సినీ రంగ ప్రముఖులు వెళ్లినట్టుగా తెలియటంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ డిన్నర్ పార్టీకి ఎంపీ దుష్యంత్ సింగ్ తో పాటుగా రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే, ఆమె కుమారుడు కూడా హాజరయ్యారు.
అయితే ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతుండడంతో డిన్నర్ పార్టీలో పాల్గొన్న దుష్యంత్ సింగ్ ఈ సమావేశాలకు కూడా హాజరయ్యారు. దీంతో పార్లమెంటు సభ్యులలో కూడా ఇంకెవరికైనా కరోనా వైరస్ సోకి ఉండొచ్చు అనే అనుమానాలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్లో ఎంపీ దుష్యంత్ సింగ్ తో సన్నిహితంగా మెలిగిన టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ ఇప్పటికే స్వీయ నిర్భంధంలోకి వెళ్తున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా పలువురు ఎంపీలు కూడా హోమ్ ఐసొలేషన్ లోకి వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా పార్లమెంటు సమావేశాల కొనసాగించటం సబబు కాదని, ఈ సమావేశాలను వెంటనే వాయిదా వేయాలని, పలువురు ఎంపీలు విజ్ఞప్తి చేస్తున్నారు.