ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19(కరోనా వైరస్) తీవ్ర ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఇటలీ దేశంపై కరోనా మహమ్మారి తన ప్రతాపాన్ని మరింతగా చూపిస్తుంది. ఇటలీలో రోజురోజుకీ మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మార్చ్ 20, శుక్రవారం నాడు ఒక్క రోజే 627 మంది కరోనా వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు ఆ దేశంలో చనిపోయిన వారి సంఖ్య 4032 కు చేరుకుంది. అలాగే శుక్రవారం నాడు మరో ఆరువేల కొత్త కరోనా కేసులు నమోదవడంతో బాధితుల సంఖ్య 47 వేలకు పైగా చేరింది.
ఇటలీలో గత మూడు రోజుల్లోనే ఈ కరోనా మహమ్మారి వలన 1500 మందికి పైగా మరణించారు. చైనాలో ఇప్పటివరకూ 81,008 మందికి కరోనా సోకగా 3250 మంది మృతి చెందారు. అయితే ఇటలీలో లాక్ డౌన్ ప్రకటించినప్పటికీ మృతుల సంఖ్య చైనాలో కంటే ఎక్కువగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వల్ల చనిపోయిన వారిలో ఇటలీ వాటాయే అత్యధికంగా 36.6 శాతంగా ఉంది. మరోవైపు కరోనా నియంత్రణ కోసం ఇటలీ ప్రభుత్వం మరింత కఠినమైన ఆంక్షలు ప్రవేశపెట్టే దిశగా ఆలోచనలు చేస్తుంది.