ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలుదేశాలను కోవిడ్-19 (కరోనా వైరస్) వణికిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా అమెరికా, ఇటలీ, స్పెయిన్ దేశాలలో ఈ వైరస్ ప్రభావం మరింత ఎక్కువుగా వుంది. అమెరికాలో న్యూయార్క్, న్యూజెర్సీల్లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకీ పెరిగిపోవడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ తాజా సమాచారం ప్రకారం మార్చ్ 30, సోమవారం సాయంత్రం 8.30 గంటల నుంచి మార్చ్ 31, మంగళవారం సాయంత్రం 8.30 గంటల వరకు 24 గంటల సమయంలో అమెరికాలో 856 మంది కరోనా వైరస్ వలన మరణించినట్టు తెలిపారు. ఇక అమెరికాలో కరోనా మరణాల సంఖ్య 3873 కు చేరుకుంది. మరోవైపు కరోనా బాధితుల సంఖ్య రెండు లక్షలకు చేరువలో వుంది.
ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ, దేశంలో రాబోయే రెండు వారాలు తీవ్రమైన బాధను ఎదుర్కోవాల్సి పరిస్థితి ఉంటుందని పేర్కొన్నారు. మరింత కఠినమైన గడ్డు పరిస్థితులు రాబోతున్నాయని, ప్రతీ అమెరికా పౌరుడు ఈ స్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ట్రంప్ విజ్ఞప్తి చేశారు. ఈ కరోనా మహమ్మారిపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో పోరాటం చేస్తుందని, అయితే ఈ వైరస్ ధాటికి లక్షకు పైగా మృత్యువాత పడే అవకాశం ఉందని వైట్ హౌస్ వర్గాలు ప్రజలను హెచ్చరించినట్టుగా సమాచారం.