దేశంలో కరోనా మహమ్మారిపై పోరాటం సాగించే దిశలో దేశప్రజలందరి ఐక్యతకు సూచికగా ఏప్రిల్ 5, ఆదివారం నాడు రాత్రి 9 గంటలకు 9 నిమిషాలపాటు లైట్లు ఆపేసి, ఈ సమయంలో ప్రజలంతా సామాజిక దూరం పాటిస్తూ కొవ్వొత్తులు, దీపం లేదా మొబైల్ ఫ్లాష్ లైట్లు ఆన్ చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ పిలుపుమేరకు ఈ దీపప్రజ్వలన కార్యక్రమానికి దేశవ్యాప్తంగా అద్భుతమైన స్పందన లభించింది. అన్ని నగరాలు, పట్టణాలు, గ్రామాల్లోని ప్రజలు ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు ఇళ్లలో లైట్లు ఆపేసి కొవ్వొత్తులు, దీప ప్రమిదలు, మొబైల్ లైట్స్, టార్చ్ లైట్లు వెలిగించి సమైక్యతను చాటారు. రాజకీయ ప్రముఖులు, కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వైద్య సిబ్బంది, సినీ ప్రముఖులు, క్రీడా కారులు సైతం ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున పాల్గొన్నారు.
ఢిల్లీలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దంపతులు, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దంపతులు, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు అమిత్షా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, హర్షవర్ధన్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్రసింగ్ రావత్ తో పాటుగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, సినీ ప్రముఖులు చిరంజీవి, రజనీకాంత్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, మోహన్బాబు, నాగార్జున, వెంకటేశ్, కృష్ణంరాజు అలాగే క్రీడా ప్రముఖులు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, వీరేంద్ర సెహ్వాగ్, పీవీ సింధు తదితరులు వారి వారి నివాసాల వద్ద కొవ్వొత్తులు వెలిగించారు.
[subscribe]