సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఈ మేరకు మార్చ్ 16, సోమవారం నాడు కేంద్ర హోం శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్ర హోం శాఖ జారీ చేసిన నోటిఫికేషన్కు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కూడా ఆమోదం తెలిపారు. నామినేటెడ్ సభ్యుల్లో ఒకరైన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది కేటీఎస్ తులసి పదవీవిరమణతో ఖాళీ అయిన స్థానంలో జస్టిస్ గొగోయ్ని నామినేట్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత ఏడాది నవంబర్ 17న జస్టిస్ రంజన్ గొగోయ్ పదవీ విరమణ పొందారు. అయోధ్య కేసులో తీర్పు వెలువరించిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి జస్టిస్ గొగోయ్ నేతృత్వం వహించారు. అలాగే రఫేల్ ఫైటర్ జెట్స్ కేసు, శబరిమలలోకి మహిళల ప్రవేశానికి సంబంధించిన కీలక కేసులను రంజన్ గొగోయ్ విచారించారు.
రాజ్యసభకు నామినేట్ అయిన తొలి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిగా రంజన్ గొగోయ్ గుర్తింపు పొందారు. గతంలో మాజీ సీజేఐ రంగనాథ్ మిశ్రా కాంగ్రెస్ లో చేరి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అయితే రాజ్యసభకు జస్టిస్ రంజన్ గొగోయ్ ను నామినేట్ చేయడాన్ని విపక్షాలు తప్పుపట్టాయి. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, ఎంఐఎం పార్టీలు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టాయి. ఈ నిర్ణయం వలన న్యాయవ్యవస్థపై ప్రభావం ఉంటుందని, ఇటువంటివి తప్పుడు సంకేతాలు పంపిస్తాయని పలువురు నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు.