ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19(కరోనా వైరస్) తీవ్ర ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. భారత్ లో కూడా కరోనా వైరస్ క్రమంగా వ్యాప్తి చెందుతుంది. దేశంలో ఇప్పటివరకు 15 రాష్ట్రాల్లో 125 కరోనా కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 39 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజిలు, యూనివర్సిటీలను మార్చ్ 31 వరకు మూసివేయాలని కేంద్ర వైద్యారోగ్య శాఖ మార్చ్ 16, సోమవారం నాడు అన్ని రాష్ట్రప్రభుత్వాలుకు ఆదేశాలు జారీ చేసింది. దేశంలో అన్ని థియోటర్లు, స్విమ్మింగ్ పూల్స్, జిమ్స్, మాల్స్ ను కూడా మూసివేయాలని పేర్కొన్నారు. అలాగే ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేసే సదుపాయం కల్పించాలని కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ వెల్లడించారు. ఈ నిర్ణయాన్ని అన్ని రాష్ట్రాలు వెంటనే అమలు చేయాలని, మార్చ్ 31 వరకు ప్రభుత్వ నిర్ణయాలను పాటించాలని స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో సమూహాలతోగడపకుండా, ఒకరి ఒకరి దూరంగా ఉండడమే కరోనా వ్యాప్తి నివారణకు మంచి మార్గమని కేంద్ర వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.
మరో వైపు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రయాణ ఆంక్షలను విధిస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. యూఏఈ, ఖతార్, ఒమన్, కువైట్ నుంచి భారత్ కు వచ్చే అందరు ప్రయాణికులు 14 రోజుల పాటు క్వారంటైన్ లో గడపాలని ప్రకటించారు. విమానాయంతో పాటుగా నౌకా ప్రయాణికులకు సైతం ఈ నిబంధనలు వర్తిస్తాయని చెప్పారు. మార్చ్ 18 నుంచి ఈ నిబంధన అమలులోకి వస్తుందని తెలిపారు. అలాగే యూరోపియన్ యూనియన్, యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్, టర్కీ, ఇంగ్లాండ్ నుంచి భారత్ కు వచ్చే వారిపై మార్చి 18 నుంచి నిషేధం విధిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఆయా దేశాల నుంచి ఏ విమానయాన సంస్థ కూడా భారతదేశానికి ప్రయాణికులను తీసుకురావద్దని స్పష్టం చేశారు. ఈ ఆదేశాలు ఓడ రేవులకు కూడా వర్తిస్తాయని తెలుపారు. ఈ ఆదేశాలన్ని మార్చ్ 31 వరకు తప్పనిసరిగా అమలులో ఉంటాయని కేంద్రం ప్రకటించింది.
ఈ అంశానికి సంబంధించిన మరికొన్ని వార్తలు:
కరోనా ఎఫెక్ట్: రైల్వే ప్లాట్ఫామ్ టికెట్ ధర పెంపు
కరోనా ఎఫెక్ట్: షిరిడీ ఆలయం, తాజ్ మహల్ మూసివేత
కరోనా వైరస్ ముప్పు – కరోనా వైరస్ లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు
కరోనా అలర్ట్: పోస్టర్ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం