2012లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో నలుగురు నిందితులకు ఫిబ్రవరి 1, 2020వ తేదీ ఉదయం 6 గంటలకు ఉరిశిక్ష అమలు చేయాలని ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలు మరోసారి వాయిదా పడింది. నిందితులను ఉరి తీయడానికి కొన్ని గంటల ముందు, ఢిల్లీ కోర్టు వారి ఉరిశిక్షను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. తదుపరి కోర్టు ఆదేశాలు వచ్చేవరకు వారిని ఉరి తీయొద్దని కోర్టు ఆదేశించింది.
ఉరి శిక్ష అమలుపై స్టే విధించాలని కోరుతూ దోషులు వేసిన పిటిషన్పై ఢిల్లీ కోర్టులో ఈ సాయంత్రం వాదనలు జరిగాయి. ఒక దోషి యొక్క రివ్యూ పిటిషన్ మాత్రమే పెండింగ్లో ఉందని, మిగతా ముగ్గురు దోషులను ఉరి తీయవచ్చని, అందుకు అనుమతి కోరుతూ తీహార్ జైలు అధికారులు కోర్టులో వాదనలు వినిపించారు. అయితే జైలు అధికారుల వాదనకు దోషుల తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక దోషి యొక్క అభ్యర్ధన పెండింగ్లో ఉన్నా కూడా ఆ కేసులో ఇతరులను ఉరి తీయలేమని కోర్టులో వాదించారు. ఈ నేపథ్యంలోనే నలుగురు దోషులు ఉరిశిక్ష అమలు వాయిదా పడింది. ముందుగా ఉరిశిక్షను నిలిపివేసుకునే క్రమంలో నలుగురు నిందితులు ఒకరి తర్వాత మరొకరు వేస్తున్న రివ్యూ పిటిషన్లను సుప్రీం కోర్టు కొట్టివేస్తూ వస్తుంది. జనవరి 31, శుక్రవారం నాడు కూడా తాను మైనర్ అంటూ నలుగురు దోషుల్లో ఒకడైన పవన్ గుప్తా వేసిన రివ్యూ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
[subscribe]