భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) జనవరి 31, శుక్రవారం నాడు కొత్త క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ)ని నియమించింది. ఈ కమిటీలో ముగ్గురు సభ్యులను నియమించారు. మదన్ లాల్, రుద్ర ప్రతాప్ సింగ్ (ఆర్పీ సింగ్), ఎంఎస్ సులక్షణ నాయక్ లు ఈ కమిటీలో చోటు దక్కించుకున్నారు. కొత్త క్రికెట్ సలహా కమిటీ సభ్యులు ఒక సంవత్సరం పాటు ఈ పదవుల్లో కొనసాగుతుతారని బీసీసీఐ సెక్రటరీ జై షా తెలిపారు. ఎంపికైన ముగ్గురు సభ్యులు కూడా గతంలో భారత్ జట్టుకు సేవలందించారు. జాతీయ జట్టును ఎంపిక చేసే సెలక్షన్ కమిటీ సభ్యులను ఈ కమిటీ ఎంపిక చేయనుంది. ప్రస్తుత చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్, మరో సెలక్షన్ కమిటీ సభ్యుడు గగన్ ఖోడా పదవీ కాలం ముగిసింది. వారి స్థానంలో కొత్త సభ్యులను క్రికెట్ సలహా కమిటీ సభ్యులు భర్తీ చేయనున్నారు. ఇప్పటికే కొత్తవారిని ఎంపిక చేసేందుకు బోర్డు దరఖాస్తులు ఆహ్వానించగా మాజీ క్రికెటర్లు అజిత్ అగార్కర్, వెంకటేశ్ ప్రసాద్, లక్ష్మణ్ శివ రామకృష్ణన్, రాజేశ్ చౌహాన్, అబే కురువిల్లా, నయన్ మోంగియా, చేతన్ చౌహాన్, నిఖిల్ చోప్రా పోటీలో నిలిచారు. సీఏసీ సభ్యులు త్వరలో వీరికి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.