ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్ 27న న్యూయార్క్లో జరిగిన 74వ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో (యుఎన్జిఎ) ప్రసంగించారు. ఐక్యరాజ్యసమితి వేదికగా నరేంద్ర మోదీ ప్రపంచానికి మరోసారి శాంతి మరియు సామరస్యం అనే సందేశాన్ని ఇచ్చారు. 17 నిమిషాల పాటు సాగిన తన ప్రసంగంలో నాయకత్వం, గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పు, అభివృద్ధి పథకాలు మరియు ఉగ్రవాదం వంటి వివిధ అంశాల గురించి మోదీ మాట్లాడారు. ఐక్యరాజ్యసమితి నిర్మించిన సూత్రాలను ఉగ్రవాదం దెబ్బతీస్తుందని మోదీ పేర్కొన్నారు. ఉగ్రవాదం గురించి మాట్లాడుతూ, మేము ప్రపంచానికి యుద్ధం కాకుండా బుద్ధుడు శాంతి సందేశం ఇచ్చిన దేశానికి చెందినవాళ్ళం. అందుకే మేము ఉగ్రవాదానికి వ్యతిరేకంగా గొంతు ఎత్తినప్పుడు తీవ్రతతో పాటు కోపం కూడ ఉంటుందని చెప్పారు.
దాదాపు 125 సంవత్సరాల క్రితం అమెరికా గడ్డపై నిలబడి స్వామి వివేకానంద వినిపించిన శాంతి సందేశాన్ని మరోసారి గుర్తు చేశారు. ఇప్పటికి కూడ భారతదేశం అవే సందేశాలతో ప్రపంచం ముందు నిలబడి ఉందని చెప్పారు. ఈ సంవత్సరం మహాత్మా గాంధీ 150వ జయంతిని యావత్ ప్రపంచం జరుపుకోబోతుంది, సత్యం అహింస ద్వారా ఆయన ఇచ్చిన సందేశం ప్రపంచ శాంతి కోసం ఎప్పటికి ఉపయోగ పడుతుందని చెప్పారు. భారతదేశంలో పరిశుభ్రత మరియు పారిశుధ్యం కోసం విజయవంతంగా ప్రారంభించిన ప్రచారం గురించి మోడీ మాట్లాడారు. తన పాలనలో, 5 సంవత్సరాలలో 11 కోట్ల మరుగుదొడ్లు నిర్మించడం ద్వారా భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద పారిశుధ్య కార్యక్రమాన్ని పూర్తి చేసిందని ఆయన అన్నారు. భారతదేశం సుమారు 50 కోట్ల మందికి ప్రయోజనం చేకూర్చే ఆరోగ్య బీమా పథకాన్ని ప్రారంభించిందని చెప్పారు. దేశంలో ‘సింగిల్ యూజ్ ప్లాస్టిక్’ ప్రచారాన్ని ప్రారంభించామని, ప్లాస్టిక్ సంచులను ఉపయోగించవద్దని భారత పౌరులను కోరారు. ప్లాస్టిక్ కు వ్యతిరేకంగా పెద్దఎత్తున భారత్ లో ప్రచారం ప్రారంభించామని చెప్పారు.
2022 లో జరుపుకునే 75వ స్వాతంత్ర్య దినోత్సవం నాటికీ దేశంలో పేదలకు మరో 2 కోట్ల గృహాలను నిర్మించి ఇవ్వబోతున్నామని అన్నారు. తాను భారతదేశం కోసం మాత్రమే కాదు, ప్రపంచ అభివృద్ధి కోసం పని చేస్తున్నానని మోదీ అన్నారు మరియు భారత ప్రభుత్వ నినాదం “సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్” అని ఆయన పేర్కొన్నారు. మోడీ ఐక్యరాజ్యసమితిలో ప్రసంగం ఇచ్చిన తరువాత, సోషల్ మీడియాలో ఆయనకు అభినందనలు వెల్లువెత్తాయి. యుఎన్జిఎలో పలు సమస్యల గురించి మాట్లాడినందుకు మరియు భారతదేశం యొక్క సహకారాన్ని చూపించినందుకు మోడీని ఐక్యరాజ్యసమితి ప్రతినిధులు మరియు దేశ నాయకులు ప్రశంసించారు.
[subscribe]